మూడు రాజ‌ధానుల‌కు మోడీ గ్రీన్ సిగ్న‌ల్: ఎంపీ

ఏపీలో మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారం ఎప్పుడు కొలిక్కి వ‌స్తుందో తెలియ‌దు కానీ, వైసీపీ నాయ‌కులు, మంత్రులు, ఎంపీలు మాత్రం అదిగో ఇదిగో అని కామెంట్లు మాత్రం చేస్తున్నారు. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏకంగా.. మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మూడు రాజ‌ధానుల‌కు సీఎం జ‌గ‌న్ కొబ్బ‌రికాయ కొట్ట‌నున్నారని వెల్ల‌డించారు. అంతేకాదు.. మూడు రాజ‌ధానులు ఇప్పుడు కొత్త‌కాద‌ని కూడా చెప్పారు. ఇది శ్రీబాగ్ ఒప్పందానికి ప్ర‌తిరూప‌మ‌ని కూడా స‌మ‌ర్థించారు.

ఇక‌, అక్క‌డితో కూడా ఆయ‌న ఆగ‌లేదు.. ఇటీవ‌ల విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ప్ర‌ధాని మోడీ.. రాజ‌ధానుల విష‌యంపై సీఎం జ‌గ‌న్‌తో ర‌హస్యంగా మాట్లాడార‌ని.. ఆయ‌న రాజ‌ధానిని ఎక్క‌డైనా ఏర్పాటు చేసుకోవా ల‌ని.. జ‌గ‌న్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని కూడా మాగుంట సంచ‌ల‌న కామెంట్లు చేయ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఒక్క‌సారిగా.. రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి.

అయితే, మ‌రోవైపు.. ఈ మూడు రాజ‌ధానుల‌పై హైకోర్టు స్టే ఇవ్వ‌డం.. ఇది సుప్రీం కోర్టులో ప్ర‌స్తుతం విచార‌ణ తొలిద‌శలోనే ఉండ‌డంతో వైసీపీ నాయ‌కులు ఇలా ప్ర‌క‌ట‌నలు చేయ‌డం.. అదిగో ఇదిగో అని చెప్ప‌డం చిత్రంగా ఉంది. ఇక‌, తాజాగా ప‌రిణామానికి మ‌వ‌సూ్తే.. శ్రీబాగ్‌ ఒడంబడికను అమలు చేస్తూ… రాయలసీమలో హైకోర్టును ఏర్పాటుచేయాలంటూ… పలుచోట్ల ర్యాలీలు, రౌండ్ టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రోజు రోజుకు ఇవి పెరుగుతున్నాయి కూడా. దీని వెనుక స‌ర్కారుపెద్ద‌లు ఉన్నార‌ని.. ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.

ఈ క్ర‌మంలో ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన వికేంద్రీకరణ సభకు… ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు. రాజధానిని నచ్చిన చోట ఏర్పాటుచేసుకోవచ్చని… ప్రధాని మోడీ… సీఎం జగన్‌కు చెప్పారని.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు.ఈ క్ర‌మంలో త్వరలోనే మూడు రాజధానులు ఏర్పాటుచేస్తామన్నారు.

శాసన రాజధానిగా అమరావతికి తాము వ్యతిరేకం కాదని.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. తిరుపతిలో నిర్వహించిన శ్రీబాగ్‌ ఒప్పంద దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అమరావతి రైతుల కంటే… రాయలసీమ ప్రజలు చేసిన త్యాగాలే గొప్పవన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో.. వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రాజధానులకే మద్దతు కార్యక్రమం కోసం పోలీసులు.. వాహనాలను మళ్లించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యాయ రాజధానిగా కర్నూలే ఉండాలంటూ.. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని టవర్‌ క్లాక్‌ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు మాహనహారం చేపట్టారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైసీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణతోనే సాధ్యమని.. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. శ్రీబాగ్‌ ఒప్పందాన్ని అమలు చేయాలంటూ… వామపక్షాల నేతలు… కడపలో ర్యాలీ చేపట్టారు.