ఎవరీ కనికా టెక్రివాల్ రెడ్డి?

ఇప్పటివరకు ఆమె ఒక ఔత్సాహిక వ్యాపారవేత్తగా సుపరిచితులు. హై ప్రొఫైల్ ఉన్న వారితో ఆమెకున్న పరిచయాలు అంతా ఇంతా కావని చెబుతారు. ఆమె స్థాయి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏ మాత్రం తగ్గదని.. ఏ రాష్ట్ర సీఎం అయినా ఆమె అనుకుంటే ఇట్టే లైన్లోకి తీసుకొచ్చే సత్తా ఉందని చెబుతారు.

అలాంటి ఆమె పేరు ఇప్పుడు ఢిల్లీ మద్యం స్కాంకు సంబంధించిన ఉదంతంలో బయటకు రావటం సంచలనంగా మారింది. సామాన్యులకే కాదు.. ఒక మోస్తరు పరిచయాలు ఉన్న వారికి సైతం ఆమె గురించి.. ఆమె స్థాయి గురించి తెలీదు. కేవలం.. వీవీఐపీలు.. అత్యున్నత స్థాయిలో ఉన్న వారికి మాత్రమే ఆమె శక్తిసామర్థ్యాలు తెలుసని చెబుతారు. ఆమే.. కనికా టెక్రివాల్ రెడ్డి.

పేరు కాస్తంత సిత్రంగా ఉండటం ఒక ఎత్తు అయితే.. చివర్లో రెడ్డి అన్న పదం ఎలా వచ్చిందన్న ఆసక్తి వ్యక్తమవుతుంది. దానికి సంబంధించిన ఆరా తీస్తే బోలెడన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమె గురించి చెప్పే ముందు స్వల్ప వ్యవధిలో ఆమె సాధించిన విజయాల్ని ప్రస్తావించాల్సిందే. కేవలం రూ.5600 పెట్టుబడితో మొదలైన ఈ సంస్థ పదేళ్ల వ్యవధిలో 500 మిలియన్ల టర్నోవర్ కు చేరుకుంది. ఐదేళ్ల క్రితం ఫోర్బ్స్ అండర్ థర్టీ విభాగంలో ఆసియాలో ప్రముఖ ఎంటర్ ప్రెన్యూర్ గా నిలిచారు.

ఇక ఆమె వ్యాపారం విషయానికి వస్తే.. సామాన్యులు.. మధ్యతరగతి వారు తమ ప్రయాణ అవసరాల కోసం ఊబెర్.. ఓలాను వాడటం.. ఈ మధ్యనే రాపిడో ఆ జాబితాలో కొంతమేర చేరటం తెలిసిందే. మనకు అవసరమైన కారు కానీ ఆటోను కానీ బుక్ చేసుకునేందుకు ఈ సంస్థలు సాయం చేస్తాయో.. అలాంటిదే పెద్ద వాళ్లు.. పలుకుబడి ఉన్న వాళ్లు.. డబ్బు దర్పం ఉన్న వారు తమ ప్రైవేటు ప్రయాణాల కోసం ప్రైవేటు విమానాల్ని అద్దెకు తీసుకొని వెళ్లాలనుకునే వారికి వెంటనే గుర్తుకు వచ్చే పేరు కనికా టెక్రివాల్ రెడ్డి.

మధ్యప్రదేశ్ లోని భోపాల్ పట్టణంలోని ఒక మార్వాడీ కుటుంబంలో పుట్టి పెరిగిన కనికా.. ‘జెట్ సెట్ గో’ పేరుతో ఒక సంస్థను స్థాపించారు. ఎవరైనా ప్రైవేటు జెట్ చార్టర్ కోరుకుంటే దాన్ని అరేంజ్ చేయటం ఆమె సంస్థ బాధ్యత. ఆ కంపెనీ పెట్టాలన్నది ఆమె కల. అందుకోసం ఆమె ఎన్నో కష్టాలు పడ్డారు. చాలా శ్రమించారు. 22 ఏళ్ల వయసులో క్యాన్సర్ కమ్మేస్తే.. దాన్ని జయించి మరీ ఈ సంస్థను స్థాపించిన సత్తా ఆమె సొంతం. రోడ్డు మీద ఉబర్ ఎలానో.. ఆకాశ ప్రయాణాల్లో జెట్ సెట్ గో అలాంటి సంస్థే అని చెబుతారు. భోపాల్ లో పుట్టిన ఆమె విద్యాభాస్యం మాత్రం ఊటీలో సాగింది.

పదో తరగతి చదివే సమయానికి ఆమె తల్లిదండ్రులు ఆమెను భోపాల్ కు తీసుకొచ్చారు. ఇక్కడే ఎకనామిక్స్ లో డిగ్రీ చేసిన ఆమె.. ముంబయిలోని విజువల్ కమ్యునికేషన్ అండ్ డిజైనింగ్ లో డిప్లొమా చేశారు. లండన్ లోని కొవెంట్రీ వర్సిటీలో ఎంబీఏ చేశారు. పైలెట్ అవ్వాలనుకున్నారు కానీ.. ఆ కలను పక్కన పెట్టి.. భారత దేశంలో ప్రైవేటు విమానాలకుఉన్న మార్కెట్.. దాని సైజు ఆమెను అమితంగా ఆకర్షించిందని చెబుతారు.

దీంతో.. ప్రైవేటు విమనాల్ని నిర్వహించాలన్న కలను నెరవేర్చుకొనేందుకు ఇండియాకు వచ్చారు. తల్లిదండ్రులతో మాట్లాడితే ఈ వ్యాపారానికి వారు ఒప్పుకోలేదు. అదే సమయంలో ఆమె క్యాన్సర్ బారిన పడ్డారు. అయినా వెనుకడుగు వేయకుండా దానికి చికిత్స తీసుకొని కోలుకున్నారు. అనంతరం 2014లో ఢిల్లీ వెళ్లిన ఆమె జెట్ సెట్ గో సంస్థను ప్రారంభించారు. తమ మాట కాదని సొంతంగా వ్యాపారం ప్రారంభించిందన్న కోపంతో ఆమె తల్లిదండ్రులు ఆమెతో కొంతకాలం మాట్లాడకుండా ఉన్నా.. తర్వాత కూతురి మీద ప్రేమతో ఆమెను అంగీకరించారు.

అంచలంచెలుగా ఎదిగిన ఆమె వ్యాపారం 2020 నాటికి ఎనిమిది సొంత ఎయిర్ క్రాఫ్టులు.. 200 మంది ఉద్యోగులకు చేరుకుంది. తమ సర్వీసు ద్వారా 2020-21 నాటికి ఆరువేల ఫ్లైట్లతో లక్ష మందిని ప్రయాణించేలా చేశారు. తమ క్లయింట్ అవసరాల కోసం ఆరు సీట్లు ఉన్న చార్టర్ ఫ్లైట్ నుంచి 18 సీట్లు ఉన్న ఫ్లయిట్ వరకు అందించేవారు.

ఇక.. ఆమెకు విజయసాయి ఫ్యామిలీకి ఉన్న అనుంబంధం గురించి వస్తే.. ఆమె ఎవరో కాదు.. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి సతీమణి. ఇంతకూ శరత్ చంద్రారెడ్డికి విజయసాయి రెడ్డికి లింకు ఏమిటన్నది చూస్తే.. ఆయన ఎవరో కాదు విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి స్వయాన అన్న. విజయసాయి రెడ్డికి ఒక కుమార్తె ఉన్నారు. ఆమె భర్తనే శరత్ చంద్రారెడ్డి. అంటే.. వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అల్లుడి అన్న సతీమణి ఈ కనికాగా చెబుతున్నారు.