మందు రేటు అడిగి తెలుసుకున్న పవన్

కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయులను మించి వార్తల్లో వ్యక్తి అవుతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. రెండు వారాల కిందటి విశాఖ పర్యటన దగ్గర్నుంచి ఆయన ఏం చేసినా సంచలనమే అవుతోంది. 

తాజాగా విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం అయిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత ఆ నగరంలోనే ఉంటూ అధికార పక్షం ఆగడాలు, అకృత్యాల గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రుషికొండను కూలగొట్టి ముఖ్యమంత్రి కోసం నిర్మిస్తున్న గెస్ట్ హౌస్‌లను దూరం నుంచి పరిశీలించారు పవన్. ఆ తర్వాత సముద్ర తీరానికి వచ్చి ఒక సామాన్యుడిలా అక్కడ తిరుగుతూ సేదదీరారు. అలాగే అక్కడ సామాన్య జనాలను కలిసి ప్రభుత్వ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అక్కడి జాలర్లతో పవన్‌ ఆసక్తికర సంభాషణ సాగించారు. కాసేపు మాట్లాడాక వారిని మద్యం రేట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. మందు రేట్లు ఎలా ఉన్నాయి అని పవన్ వారిని అడగ్గా… తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నపుడు చీప్ లిక్కర్ క్వార్టర్ 50 రూపాయలే ఉండేదని.. ఇప్పుడది 150 అయిందని.. ఇంతలా రేట్లు పెంచేస్తే ఎలా అని జాలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రేట్లూ పెరిగిపోయాయని.. ప్రభుత్వ పనితీరు ఏమీ బాగాలేదని జాలర్లు వ్యాఖ్యానించారు. ఇంకా వివిధ అంశాలపై పవన్ వారిని ప్రశ్నించారు. 

జగన్ సర్కారు అధికారంలోకి వచ్చీ రాగానే అప్పటిదాకా ఉన్న బ్రాండ్లు అన్నింటినీ పక్కన పెట్టేయడం.. మద్యం ధరలను విపరీతంగా పెంచేసి సొంత బ్రాండ్లను అమ్మడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మామూలుగా మద్యం తాగడమే ప్రమాదకరం అంటే.. జగన్ సర్కారు తీసుకొచ్చిన మద్యం బ్రాండ్లు మరింత డేంజర్ అని.. అవి దీర్ఘ కాలం తాగితే ఒళ్లు గుల్లవడం గ్యారెంటీ అని నిపుణులు అంటున్నారు. రేట్ల పెంపు, పేరున్న బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం.. ఈ కారణాలతో మందుబాబులు జగన్ సర్కారు మీద తీవ్ర వ్యతిరేకతతోనే ఉన్నారు.