ఇది స‌ర్కారు వ్య‌తిరేక‌తా..? బాబు సానుకూల‌తా?

రాజ‌కీయంగా ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీ ఒక కీల‌క‌మైన పొజిష‌న్‌లో ఉంది. ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాదిన్న‌ర స‌మ‌యం మాత్ర‌మే ఉంది. దీంతో ఎక్క‌డ ఏం జ‌రిగినా.. త‌మ‌కు అనుకూలంగా ఉందా? వ్య‌తిరేకంగా ఉందా? అని నాయ‌కులు తెగ చ‌ర్చించుకుంటున్నారు. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ విష‌యంలో ఈ చ‌ర్చ మ‌రింత ఎక్కువ‌గానే ఉంది. చంద్ర‌బాబు పాల్గొంటున్న స‌భ‌ల‌కు, కార్య‌క్ర‌మాల‌కు జ‌నాలు వ‌స్తున్న తీరును వైసీపీ నాయ‌కులు నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. స‌హ‌జంగానే చంద్ర‌బాబు అయినా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయినా స‌భ‌లు పెడితే జ‌నాలు వ‌స్తున్నారు.

అయితే.. ఈ వ‌స్తున్న జ‌నాల వెనుక రీజ‌న్ ఏంటి? అనేది ఇప్పుడు వైసీపీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా జనం కదంతొక్కారు. ఇసుకేస్తే రాలనంతగా రోడ్లపైకి వచ్చారు. దీనిపై టీడీపీ నాయ‌కులు ఆస‌క్తిగా స్పందించారు. వైసీపీ ప్ర‌భుత్వ తీరుపై వ్య‌తిరేక‌త పెరిగింద‌ని, స‌ర్కారుపై ప్రజావ్యతి రేక పెల్లుబకడంతోనే చంద్ర‌బాబు స‌భ‌ల‌కు జనం నుంచి ఇంత స్పందన వచ్చిందని భాష్యం చెప్పారు. అంతేకాదు.. ఈ హ‌వా గ‌త తిరుప‌తి స‌భ‌తో పోల్చితే మ‌రింత పెరిగింద‌ని కూడా నాయ‌కులు చెబుతున్నారు.

మరోవైపు ప్రజల ఆలోచనలో మార్పు కనిపిస్తోందని వైసీపీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా అటు ప‌వ‌న్‌, ఇటు చంద్ర‌బాబు స‌భ‌ల‌కు పోటెత్తుతున్న జ‌నాల‌ను చూసి వైసీపీలో నేత‌లు చ‌ర్చ చేస్తున్నారు. “ఏపీలో సమీకరణాలు మారుతున్నాయి. ఒక్క జిల్లాలో అయినా ప్ర‌జ‌ల తీరులో మార్పు క‌నిపిస్తే.. అది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తుంది” అని వైసీపీ నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. పైగా… రాష్ట్రానికి మధ్యలో ఉన్న కృష్ణా జిల్లాలో మారిన గాలి ఇప్పుడు రాజకీయాల్లో దుమారం రేపుతోందని ప‌రిశీల‌కులు కూడా చెబుతున్నారు. అందరినోట ఇదే చర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

చంద్రబాబు కృష్ణా జిల్లా పర్యటన సందర్భంగా జనం రోడ్లపైకి వచ్చారు. టీడీపీ నేతలు సయితం ఊహించని విధంగా జనం రాక ఏపీ రాజకీయాల్లో చర్చనియాంశమైంది. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు కృష్ణాజిల్లా, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఎవరూ ఎలాంటి జనసమీకరణ చేయకుండానే ఇసుక వేస్తే రాలనంతగా జనం హాజరయ్యారు. పరిటాల, కంచికచర్ల, నందిగామల్లో జాతీయ రహదారి చంద్రబాబు రోడ్ షోతో కిక్కిరిసిపోయింది. దీంతో నిన్నటి వరకు గుంభ‌నంగా ఉంటూ వచ్చిన జనం.. ఒక్కసారిగా భయాన్ని వదిలేసిన‌ట్టు వెల్లువ‌లా క‌ద‌లి వ‌స్తున్నార‌ని, ఇదేదో రాజ‌కీయ మార్పున‌కు నాందిగా క‌నిపిస్తోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.