వివేకా హత్య కేసులో సంచలనగా మారిన షర్మిల వాంగ్మూలం

గత నెల ఏడో తేదీని వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎందుకు ఢిల్లీకి అన్న ప్రశ్నకు అందరికి చెప్పిన సమాధానం తెలంగాణలో అతి గొప్ప ప్రాజెక్టుగా చెప్పే కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి చోటు చేసుకుందని.. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఫిర్యాదు చేశారు. అయితే.. జరిగింది ఇది మాత్రమే కాదు.. తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి తనకు తెలిసిన సమాచారం.. తనకు అవగాహన ఉన్న అంశంపై సీబీఐకి ఆమె వాంగ్మూలాన్ని ఇచ్చిన వైనం బయటకు వచ్చింది.

అంతేకాదు.. తాను ఇచ్చిన వాంగ్మూలంలో వైఎస్ వివేకా హత్య వెనుక ఎవరున్నారు? అన్న విషయం మీదా ఆమె స్పష్టమైన వివరాల్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు. వివేకాహత్య నేపథ్యంలో ఆమె తన వాంగ్మూలాన్ని ఇవ్వాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. కడప కార్యాలయానికి కానీ ఢిల్లీ కార్యాలయానికి కానీ ఆమె తన వాంగ్మూలాన్ని ఇవ్వొచ్చని చెప్పటంతో.. ఢిల్లీ ఆప్షన్ ను తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

ఇంతకూ సీబీఐకు షర్మిల ఏం చెప్పారు? అన్నదిచూస్తే.. ఆమె సంచలన అంశాల్ని వెల్లడించినట్లుగా చెబుతున్నారు. తనకున్న సమాచారం ప్రకారం వైఎస్ వివేకాను చంపింది అవినాశ్ రెడ్డి.. భాస్కర్ రెడ్డే అన్న విషయాన్ని ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎందుకు చంపాల్సి వచ్చింది? కారణాలు ఏమిటి? అని సీబీఐ ప్రశ్నించిన సందర్భంలో షర్మిల స్పష్టమైన సమాధానాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది.

సీబీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. వివేకాను హత్య చేయటానికి ఇతర కారణాల కంటే కూడా రాజకీయ అంశాలే అన్నట్లు తెలుస్తోంది. వివేకాను వ్యతిరేకించేవారు ఎవరూ లేరని.. అయితే కడప ఎంపీ టికెట్ విషయంలో తమ ఇంట్లో గొడవలు ఉన్నట్లుగా షర్మిల పేర్కొన్నారు. టికెట్ కోసం తమ బాబాయ్ వివేకానంద గట్టి పోటీదారుగా ఉన్నారని.. అదే టికెట్ కోసం వైఎస్ అవినాశ్ రెడ్డి కూడా పోటీ పడుతున్నట్లు ఆమె చెప్పారు.

వివేకా ఎంపీగా పోటీకి దిగితే తమ ఉనికికి ఇబ్బంది ఉంటుందన్న ఉద్దేశంతోనే అవినాశ్ రెడ్డి.. భాస్కర్ రెడ్డిలు ఆయన్ను చంపించారని తనకున్న సమాచారమని షర్మిల పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. గత నెల 21న మరోసారి ఢిల్లీ వెళ్లిన ఆమె.. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈడీకి ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంలోనూ మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంలోనూ వివేకా హత్య మీద ఆమెను ప్రశ్నించినప్పుడు సూటిగా.. స్పష్టంగా వ్యాఖ్యలు చేయటం అప్పట్లో ఆసక్తికరంగా మారింది.

షర్మిలకు లేదా విజయలక్ష్మికి మాత్రమే ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ను వివేకా కోరారని… ఈ నేపథ్యంలోనే వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి ఈ హత్య చేయించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ పేర్కొంది కదా! దీనిపై మీ స్పందన ఏమిటి?’’ అని మీడియా ప్రశ్నించగా… ‘వాస్తవం’ అని సూటిగా చెప్పేయటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా.. ఆమె సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించిన సమాధారం బయటకు వచ్చి కలకలం రేగుతోంది. ఈ వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి.. షర్మిల సోదరుడు జగన్ సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు.