తూర్పులో జ‌నం నాడి మారుతోందా… !

రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ పుంజుకుంది. ఇది అనూహ్య‌మ‌నే మాట వినిపించింది. ఎందుకంటే.. ఇక్క‌డ చాలా నియోజ‌క‌వ‌ర్గా ల్లో టీడీపీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. కొన్ని ద‌శాబ్దాలుగా గెలుస్తున్న నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ఉన్నాయి. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గెలిస్తే.. ఉమ్మ‌డి తూర్పులో 12 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ స‌త్తా చాటింది. ఇక‌, రాజ‌మండ్రి, కాకినాడ పార్ల‌మెంటు స్థానా్లోనూ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. మ‌రి ఇప్ప‌డు ప‌రిస్తితి ఎలా ఉంది? అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. వైసీపీ తీసుకువ‌చ్చిన మూడు రాజ‌ధానుల‌పై ఇక్క‌డి ప్ర‌జ‌లు స‌గానికిపైగా మండిప‌డుతున్నారు.

దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ ఇటీవ‌ల రాజ‌ధాని రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర 2.0కు అమోఘ‌మైన స్వాగ‌తం ఇక్క‌డ ల‌భించింది. రాజ‌మండ్రిలో కొంత అల‌జ‌డి క‌నిపించినా.. ఇత‌ర ప్రాంతాల్లో మాత్రం ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. దీంతో మూడు రాజ‌ధానుల ఆకాంక్ష ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఉందా? లేదా? అనే విష‌యంపై తీవ్ర‌చ‌ర్చ సాగింది. సో.. వ్యాపార ప‌రంగా చూస్తే.. విజ‌య‌వాడ ఇక్క‌డివారికి ఎన్నోఏళ్లుగా క‌లిసి వ‌స్తోంది. కాబ‌ట్టివారు రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే కోరుకుంటున్నార‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

ఈ ప‌రిణామాల‌కు తోడు.. ఎంపీ మార్గాని వ‌ర్సెస్ వైసీపీ ఎమ్మెల్యేల వివాదాలు కూడా ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌డం లేదు. దీంతో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

టీడీపీ విష‌యానికి వ‌స్తే.. పాత నేత‌లు పుంజుకున్నారు. పైగా.. కొన్నినియోజ‌క‌వ‌ర్గాల్లో యువ‌త క‌లిసి వ‌స్తున్నారు. కొవ్వూరు లాంటి చోట్ల టీడీపీ గెలుపు త‌థ్య‌మ‌నే భావ‌న క‌నిపిస్తోం ది. రాజ‌మండ్రి రూర‌ల్, సిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ నేత‌లు నిర్వ‌హిస్తున్న అన్న‌క్యాంటీన్లు మ‌ళ్లీ పార్టీకి క‌లిసి వ‌స్తున్నాయి.

అదేస‌మ‌యంలో ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ నాయ‌కులు ఈ కార్య‌క్ర‌మాల‌కు ప్లాన్ చేస్తున్నారు. నేత‌లు క‌లిసి క‌ట్టుగా ఉంటున్నారు. దీంతో టీడీపీ పుంజుకోవ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు కూడా అదే త‌ర‌హా ప‌రిస్థితి రావ‌డం ఖాయ‌మ‌ని నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు. మాజీ మంత్రులు, నాయ‌కులు ఇత‌ర జిల్లాల‌తో పోల్చుకుంటే ఇక్క‌డ‌ క‌లిసి ప‌నిచేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

పైగా.. తూర్పుగోదావ‌రిలోని ఆవ భూముల వ్య‌వ‌హారం వైసీపీకి ఇబ్బందిగా మారింది. ఇసుక‌, మ‌ట్టి, వ్య‌వ‌హారాల్లో నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ఫ‌లితంగా ప్ర‌జ‌ల్లో వైసీపీ అంటే చుల‌క‌న భావం ఏర్ప‌డింద‌నే చ‌ర్చ‌జ‌రుగుతోంది. ఇదిలావుంటే, సీఎం జ‌గ‌న్ ఎంత చెబుతున్నా..నాయ‌కులు క‌లిసి క‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌కుండా ఎవ‌రికి వారే అన్న‌ట్టుగా ఉన్నారు. కాపులు మ‌రింత‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

కాకినాడ సిటీ ఎమ్మెల్యేపై ప్ర‌జ‌లు తీవ్ర వ్య‌తిరేక‌త‌తో ఉన్నార‌నేది సీఎం జ‌గ‌న్‌కు అందిన రిపోర్టు స్ప‌ష్టం చేస్తోంద‌నే చ‌ర్చ ఆపార్టీలోనే ఉంది. రూర‌ల్‌లో ఈ సారి కుర‌సాల ఓట‌మి ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇలా.. తూర్పులో ఈ ద‌ఫా టీడీపీ మ‌ళ్లీ పుంజుకుని 2014 నాటి హ‌వాతో ముందుకు సాగుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.