పైన మోడీ.. ఇక్కడో బోడి.. మధ్యలో ఈడీ

మాటకారితనంలో, ప్రత్యర్థుల మీద పంచులు వేయడం, పదునైన విమర్శలు గుప్పించడంలో తండ్రి కేసీఆర్‌కు తగ్గ తనయుడిగా ఎప్పుడో రుజువు చేసుకున్నాడు కేటీఆర్. కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక ముంగిట ఆయన ఆయన తన మాటల పదును మరోసారి చూపించారు. టీవీ9 స్టూడియోలో కూర్చుని ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. ప్రత్యర్థులపైకి తనదైన శైలిలో వాగ్బాణాలు సంధించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన ఒక కామెంట్ వైరల్ అయింది. ‘మోడీ బోడీ ఈడీ’ అంటూ రైమింగ్‌తో ఆయన భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసిన విధానం టీఆర్ఎష్ శ్రేణులకు, బీజేపీ వ్యతిరేకులకు భలే కిక్కు ఇస్తోంది. రాజకీయ ప్రత్యర్థుల మీదికి సీబీఐ, ఈడీలను వదిలి వారిని దారిలోకి తెచ్చుకోవడం మోడీ సర్కారుకు అలవాటుగా మారిన నేపథ్యంలో మీపైకి వాటిని ప్రయోగిస్తే మీరేం చేస్తారు అని న్యూస్ ప్రెజెంటర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేటీఆర్ ఈ కామెంట్ చేశారు.

“పైనో మోడీ.. ఇక్కడో బోడి (బండి సంజయ్‌ని ఉద్దేశించి).. మధ్యలో ఈడీ.. ఏం చేసుకుంటారో చేసుకోమనండి. మేం రెడీ. దేనికైనా రెడీ. ఇట్లాంటి దద్దమ్మలకు భయపడేది లేదు. నరేంద్ర మోడీ ఒక అసమర్థ ప్రధాని. దేశంలో ఆయనంత చేతకాని, పోటీ పడలేని, అసమర్థ, అవినీతి, పెట్టుబడిదారుల కొమ్ము కాసే నాయకుడు ఇంకొకరు లేరు. అలాంటి వ్యక్తి బెదిరింపులకు ఉడత ఊపులకి తెలంగాణ బిడ్డ కానే కాదు. మళ్లీ చెబుతున్నా ఏం చేసుకుంటారో చేసుకోమనండి” అంటూ తనదైన శైలిలో ఫైర్ అయ్యారు కేటీఆర్.

తెలుగుదేశం ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ సహా చాలామంది ఇతర పార్టీల నేతల మీదికి ఈడీ లాంటి సంస్థలను ఉసిగొల్పి వారిని తమ పార్టీలో చేర్చుకున్న ఘనత బీజేపీకే చెల్లిందని.. కానీ తెలంగాణలో ఇలాంటివి చెల్లవని.. ఇలాంటి బెదిరింపులకు తాము ఏమాత్రం భయపడేది లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.