కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. సీబీఐ రావొద్దంటూ జీవో!

తెలంగాణ సర్కార్ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు అనుమతిని ఉపసంహరించింది. రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేలా గతంలో అనుమతి ఉండేది. గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆగస్టు 30వ తేదీరోజే జీవో 51ను ప్రభుత్వం జారీ చేసింది. అయితే, దీనిని ఇప్ప‌టి వ‌రకు బ‌య‌ట‌పెట్ట‌లేదు. నిజానికి ఇది ఆగ‌స్టులోనే తీసుకుంటే.. రెండు మాసాల పాటు ఏంచేశార‌నేది ప్ర‌శ్న‌. స‌రే.. ఏదేమైనా.. ఇక రాష్ట్రంలో ఏ కేసునైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జీవోలో పేర్కొంది.

ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సీబీఐ కేసులు పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం రెండు నెలల క్రితమే తీసుకున్న ఈ కీలక నిర్ణయాన్ని ఇప్పుడు బ‌య‌ట‌కు తీసుకురావ‌డం గ‌మ‌నార్హం. రెండు నెలలుగా ఈ జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచింద‌నేది కూడా ఆస‌క్తిగా మారింది. ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయ‌ల‌ను ఎర వేసిన కేసును సీబీఐ దర్యాప్తు చేయాలన్న బీజేపీ పిటిషన్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం వెలుగులోకి రావ‌డం మ‌రింత ఆస‌క్తిగా మారింది. సీబీఐ దర్యాప్తునకు అనుమతి వెనక్కి తీసుకున్నట్లు అదనపు ఏజీ హైకోర్టుకు తెలిపారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే.. గ‌తంలో ఏపీ ప్ర‌భుత్వ సార‌థి చంద్ర‌బాబు హ‌యాంలో ఢిల్లీ పెద్ద‌ల‌తో వ్య‌వ‌హారం చెడిపోయిన త‌ర్వాత‌.. ఇలానే సీబీఐని అనుమ‌తించేది లేదంటూ.. నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు జీవో కూడా పాస్ చేశారు. అయితే.. అప్ప‌ట్లో ఈ విష‌యంపై కేసీఆర్ కొన్ని కామెంట్లు చేశారు. “అక్ర‌మాలు జ‌రుగుతున్న‌ప్పుడు.. విచారించాల్నా వ‌ద్దా.. అడ్డు చెప్త‌రా? అంటే.. అక్ర‌మాలు ప్రొత్స‌హిస్తునట్టే క‌దా! ఇలాంటోళ్లు తెలంగాణ‌కు వ‌స్తే ఏం జ‌రుగుతుంది?” అంటూ.. 2018 ఎన్నిక స‌మ‌యంలో దీనిని కూడా ప్ర‌చారానికి వాడుకున్నారు. మొత్తంగా చూస్తే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామం కేసీఆర్‌కు మేలు చేయ‌క‌పోగా మ‌రిన్ని అనుమానాల‌కు తావిచ్చేలా ఉంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.