జగన్ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పడానికి కుప్పం చాలు: చంద్ర‌బాబు

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి క్యారెక్టర్ ఏంటో తెలియాలంటే వైసీపీ ప్రభుత్వం కుప్పంలో చేస్తున్న అరాచకాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చని టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ది రాజకీయాలు మాత్రమే తెలిసిన కుప్పం ప్రజలకు వైసీపీ అరాచక రాజకీయం కొత్తగా ఉందని ఆయన విమ‌ర్శించారు. కుప్పంను తొలి నుంచి ఒక మోడల్ నియోజకవర్గంగా చేశామని.. హింసను, విద్వేష రాజకీయాలను ఇక్కడి ప్రజలు అనుమతించరని చంద్రబాబు అన్నారు. పార్టీ నియోజకవర్గాల ఇంచార్జ్ లతో నిర్వ‌హిస్తున్న స‌మీక్ష‌లో భాగంగా తాజాగా కుప్పం నేతలతో సమీక్ష నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. నేతలు ఎవరూ భేషజాలకు పోవద్దని.. గ్రామ స్థాయి వరకు అందరినీ కలుపుకొని వెళ్లాలని గట్టిగా సూచించా రు. కుప్పంలో ప్రజలు అభిమానంతో తనను గెలిపిస్తూ వస్తున్నారని.. పులివెందుల మాదిరిగా భయ పెట్టి ఓట్లు వేయించుకోవడం లేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఒకే సింబల్ పై అన్ని సార్లూ గెలిచిన నియోజకవర్గాలు కుప్పం, హిందూపురం అని చంద్రబాబు గుర్తు చేశారు. ఇదే సందర్భంలో పులివెందులలో.. నేతలు, పార్టీలు, గుర్తులు ఆయా ఎన్నికల్లో మారాయని పేర్కొన్నారు.

కుప్పంలో నేతలను, కార్యకర్తలను… కేసులు, దాడులు, కుల విద్వేషాలతో నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని.. దీన్ని స్థానిక నాయకత్వం సమర్థంగా తిప్పి కొట్టాలని నేతలకు సూచించారు. తమకు ఊడిగం చేసే అధికారులను ఉపయోగించుకుని అరాచకాలు చేస్తున్న వైసీపీ నేతల లెక్కలు సరిచేస్తామని చంద్రబాబు చెప్పారు. పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు తమను భయపెట్టలేదని…..పైగా అంతా ఇప్పుడు మరింత ఐక్యంగా పోరాడుతున్నామని నాయ‌కులు ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుకు చెప్పారు. ఈ తరహా ప్రభుత్వ పోకడలతో ప్రజల్లో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వివరించారు.

మంగళగిరి నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తరువాత 1983,1985 ఎన్నికల్లో పార్టీ గెలిచిందని…1989 నుంచి 2009 వరకు జరిగిన 5 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు టిక్కెట్లు ఇవ్వాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు. పొత్తుల్లో రెండు దశాబ్దాల పాటు మంగళగిరి సీటు వేరే పార్టీలకు ఇచ్చుకుంటూ వచ్చిన కారణంగా నియోజకవర్గంలో అప్పట్లో పార్టీ బలోపేతం కాలేదని చెప్పారు. 2019 ఎన్నికల తరువాత పార్టీ యాక్టివిటీ పెంచడం, కార్యకర్తల సంక్షేమం చూడడం, ఇతర కార్యక్రమాల కారణంగా మంచి మార్పు కనిపిస్తుందని చంద్రబాబు అన్నారు. అయితే దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని, తిరుగు లేని విజయంతో మంగళగిరిలో కొత్త చరిత్ర రాయాలని ఇంచార్జ్ లోకేష్ కు పార్టీ అధినేత సూచించారు.