నిమ్మకాయలో టెన్షన్ పెరిగిపోతోందా ?

Nimmakayala Chinarajappa
Nimmakayala Chinarajappa

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో మాజీ హోంశాఖ మంత్రి Nimmakayala Chinarajappa కు ఇంటిపోరు తప్పేట్లులేదు. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గానికి నిమ్మకాయల ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడినుండి ఈ సీనియర్ నేత 2014, 19 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచారు. మొదటిసారి గెలవగానే హోంశాఖ మంత్రిగా పనిచేశారు. మొదటి నుంచి పార్టీలో బాగా యాక్టివ్ గా చంద్రబాబునాయుడు నమ్మకస్తుల్లో ఒకరికి నిమ్మకాయలకు మంచిపేరుంది.

ఈ మధ్యనే సిట్టింగులకే మళ్ళీ టికెట్లిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. కాబట్టి తనకు టికెట్ ఖాయమన్న పద్దతిలో నిమ్మకాయల నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు. అయితే హఠాత్తుగా సామాజిక వర్గాల గోల పెరిగిపోయిందట. కాపు సామాజికవర్గంకు చెందిన నిమ్మకాయలకు కమ్మ సామాజికవర్గంకు చెందిన నేతలతో మొదటినుండి పడటంలేదు. అసలు నిమ్మకాయలకు పెద్దాపురం నియోజకవర్గంతో సంబంధమే లేదు.

2014 ఎన్నికల్లో పార్టీలో సర్దుబాట్ల కోసమని అప్పట్లో నిమ్మకాయలకు పెద్దాపురం టికెట్ ఇచ్చారంతే. అయితే అక్కడ గెలవటంతో ఇదే నియోజకవర్గంలో కంటిన్యూ అవుతానని నిమ్మకాయల కోరటంతో చంద్రబాబు సరేఅన్నారు. కానీ ఇపుడు కమ్మ సామాజికవర్గంలో బలమైన నేత బొడ్డు భాస్కరరావు తెరమీదకు వచ్చారు. మొదటినుండి ఈ నియోజకవర్గంలో ఉన్నది బొడ్డే. అప్పట్లో ఏవో సాంకేతిక కారణాలు అడ్డు రావటంతో బొడ్డుకు టికెట్ ఇవ్వలేకపోయారంతే. తర్వాత ఎంఎల్సీ ఇచ్చినా తనకు ఎంఎల్ఏ టికెట్టే కావాలని ఇపుడు బొడ్డు పట్టుబడుతున్నారు.

బొడ్డుతో పాటు మరో నేత చంద్రమౌళి కూడా టికెట్ రేసులోకి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకు గ్యారెంటీ అంటు చంద్రమౌళి ప్రచారం కూడా చేసుకుంటున్నారు. దాంతో నిమ్మకాయల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఈమధ్యనే కమ్మ సామాజికవర్గంలోని నేతలు పెద్దాపురం టికెట్ విషయంలోనే చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అప్పటినుండి సిట్టింగ్ ఎంఎల్ఏకి టికెట్ విషయంలో అయోమయం పెరిగిపోతోంది. మొత్తానికి పెద్దాపురం టికెట్ ఎవరికనే విషయంలో చంద్రబాబు మనసులో ఏముందో తెలీదు. అయితే జనాల్లోను, నేతల్లో మాత్రం అయోమయం పెరిగిపోతోంది.