పాపం స్ర‌వంతి.. సీనియ‌ర్ల దెబ్బ‌కు విల‌విల‌!!

సీనియ‌ర్ నేత‌ల మాట‌ల‌పై విశ్వాసం ఉంచారు. ‘నీకెందుకు.. మేమున్నాం..’ అంటే.. మ‌న‌స్పూర్తిగా నమ్మారు. అప్పులు చేసి మ‌రీ కొంత సొమ్మును పోగు చేసుకున్నారు. మునుగోడు ఉప పోరు బ‌రిలో ఆరుమాసాల అధికారం కోసం త‌ల‌ప‌డేందుకు రెడీ అయ్యారు. ఆమే పాల్వాయి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి కుమార్తె.. స్ర‌వంతి!! సీనియ‌ర్ల‌పై ఎంతో న‌మ్మకం ఉంచి రంగంలోకి దిగిన స్ర‌వంతికి.. ఇప్పుడు.. చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె కోసం ఫైట్ చేసిన వెంక‌ట‌రెడ్డే.. ’10 వేల ఓట్లు వ‌స్తే.. ఎక్కువ‌’ అని కామెంట్ చేయ‌డం.. ఇది జోరుగా వైర‌ల్ కావ‌డం.. స్ర‌వంతికి మ‌నోవేద‌న‌ను మిగుల్చుతోంది. మ‌రోవైపు అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో సీనియ‌ర్లు ప్ర‌చారానికి ముఖం చాటేస్తున్నారు. వెర‌సి.. ఇప్పుడు.. స్ర‌వంతి విల‌విల్లాడుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

మునుగోడు పోరును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బీజేపీ, అధికార టీఆర్ఎస్‌ పార్టీల నాయకులు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తుండగా కాంగ్రెస్‌ నేతలు మాత్రం చుట్టం చూపునకే పరిమితం అవుతున్నారు. పాల్వాయి స్రవంతి మినహా నియోజకవర్గ బాధ్యులు మండల బాధ్యులు సైతం ప్రచారాన్ని పూర్తిస్థాయిలో చేయడం లేదు. మండలాల ఇంఛార్జ్లుగా సీనియర్‌ నాయకులు ఉన్నప్పటికీ.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీతక్కలు మినహా ఎవరూ క్షేత్రస్థాయిలో ఆశించిన మేర పని చేస్తున్నట్లు కనిపించడం లేదు.

గత అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్ ఈ సారి మునుగోడు ఉప పోరులో అభ్యర్థిని త్వరితంగానే ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యాక ప్రచార హోరు పెంచాల్సిన కాంగ్రెస్‌ కాస్త వెనుకపడింది. బీజేపీ, టీఆర్ఎస్‌లు రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని రంగంలోకి దించి జోరు పెంచితే అందుకు భిన్నంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రచారంలో ఊపు లేదనే విమర్శలు వ‌స్తున్నాయి. బూత్ స్థాయి సమన్వయకర్తలు, క్లస్టర్‌ ఇంఛార్జ్లు మండలానికి సీనియర్లను ఇంఛార్జ్లుగా నియమించినా ఆ దిశగా ప్రచారంలో ఊపు లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో పాటు ఉత్తమ్‌, గీతారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీ, సంపత్‌కుమార్‌, వీహెచ్, జీవన్రెడ్డి, శ్రీధర్‌బాబులు మండలాల ఇంఛార్జ్లుగా ఉన్నారు. అయినా.. క్షేత్రస్థాయిలో సీనియర్‌ నాయకులు బీజేపీ, టీఆర్ఎస్‌కు దీటుగా ముందుకెళ్లడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రేవంత్‌, ఉత్తమ్‌ సీతక్క, సంపత్‌కుమార్‌ వారంపాటు నియోజకవర్గం అంతా సుడిగాలి పర్యటన చేశారు. నామినేషన్‌ రోజున నేతులంతా ఐక్యంగా హాజరయ్యారు. ఆ తర్వాత రెండు రోజులకే కాంగ్రెస్‌ ప్రచారం అటకెక్కింది. అభ్యర్థి స్రవంతి మాత్రమే ఇంటింటా ప్రచారంతో కార్యక్షేత్రంలో కదులుతున్నారు. రేవంత్ మాత్రం బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హిస్తున్నారు.

దెబ్బేస్తున్న జోడో యాత్ర‌!

మునుగోడు ఉప పోరు కంటే రాహుల్‌ పాదయాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని కొందరు నేతలు ముఖం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. గెలుపుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత్‌ జోడోయాత్ర ఆదివారం రాష్ట్రంలోకి ప్రవేశిస్తుండడంతో దానిని విజయవంతం చేసేందుకు తగిన ఏర్పాట్లలో తలమునకలయ్యారు. మునుగోడు కంటే రాహుల్‌ పాదయాత్రను విజయవంతం చేయాలన్న అంశానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో స్ర‌వంతి ప‌రిస్థితి చివురుటాకులా మారింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.