ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తే:  రాహుల్ కామెంట్స్‌

Rahul Gandhi

ఏపీలో మూడు రాజ‌ధానులు అనేది బుద్ధిలేని ఆలోచ‌న అని కాంగ్రెస్  అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఒక రాష్ట్రం.. ఒక రాజ‌ధాని అనేదే కాంగ్రెస్ నినాద‌మ‌ని.. దానికే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం భార‌త్ జోడోయాత్ర‌లో ఉన్న రాహుల్ గాంధీ.. క‌ర్నూలులో మీడియాతో మాట్లాడారు. ఇదే స‌మ‌యంలో స్థానికంగా కొంద‌రితోనూ.. ఆయ‌న చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా కొంద‌రు రాజ‌ధాని విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఏపీకి అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉంద‌ని.. అయితే.. ప్ర‌భుత్వం మారాక మూడు రాజ‌ధానులు అనే పాట పాడుతోంద‌ని అన్నారు.

దీనిపై రాహుల్ స్పందిస్తూ.. తాను తెలుగు అర్ధం చేసుకుంటాన‌ని.. త్వ‌ర‌లోనే తెలుగులో కూడా మాట్లాడ‌తాన‌ని.. చెప్పారు. త‌మ పార్టీ విధానం.. ఒకే రాష్ట్రం ఒకే రాజ‌ధాని అని వివ‌రించారు. ఏపీకి అమ‌రావ‌తే రాజ‌ధానిగా ఉంటుంద‌ని.. దానికే తాము మ‌ద్ద‌తిస్తామ‌ని అన్నారు. “నిన్న న‌న్ను.. కొంద‌రు రైతులు క‌లిశారు. వారంతా కూడా.. అమ‌రావ‌తి కోసం.. త‌మ భూములు ఇచ్చారు. వారిప్పుడు.. ఇబ్బందిలో ఉన్నారు. పాద‌యాత్ర చేస్తున్నారు. రాజ‌ధాని కోసం.. వారు అలుపెరుగ‌ని కృషి చేస్తున్నారు. మేం మాత్రం అమ‌రావతికే మ‌ద్ద‌తిస్తాం. రైతుల‌కు న్యాయం చేస్తాం“ అని అన్నారు.

దేశాన్ని ఏకం చేయడమే ‘భారత్‌ జోడో యాత్ర’ లక్ష్యమని, యాత్ర ద్వారా ప్రజలతో మమేకమవుతున్నట్లు రాహుల్‌ చెప్పారు. పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోనిలో ఆయ‌న ఈ రోజు ఉద‌యం న‌డ‌క ప్రారంభించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా ఇవ్వడంతో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని రాహుల్‌ పునరుద్ఘాటించారు. “నేను గ‌తంలో కూడా చెప్పాను. ప్ర‌త్యేక హోదా ఫైలుపైనే తొలి సంత‌కం చేస్తాను. ఈ విష‌యంలో ఎలాంటి సందేహాలు అవ‌స‌రం లేదు..“ అని వ్యాఖ్యానించారు.

కానీ, శుక్ర‌వారం వ‌ర‌కు.. ఏపీలో రాహుల్ పాద‌యాత్ర జ‌ర‌గ‌నుంది. మ‌ళ్లీ నాలుగు రోజుల్లో ఏపీలో ఆయ‌న పాద‌యాత్ర మొద‌లు కానుంది. తాజాగా యాత్ర‌కు యువ‌కులు అధిక సంఖ్య‌లో పాల్గొన్నారు. వారిని పేరు పేరునా.. రాహుల్ ప‌ల‌క‌రించ‌డం గ‌మ‌నార్హం. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. పార్టీని అధికారంలోకి తెచ్చేలా.. ప్ర‌య‌త్నం చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.