రోజాకు ఇబ్బందులు తప్పవా?

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో ముందంతా మంత్రి రోజాకు ఇబ్బందులు తప్పేట్లే లేదు. మామూలుగానే రోజాకు నియోజకవర్గంలో బలమైన ప్రత్యర్ధివర్గం చాలా యాక్టివ్ గా ఉంటుంది. మంత్రయిన తర్వాత ప్రత్యర్ధివర్గంతో విభేదాలు సర్దుకుంటాయని అనుకుంటే అవి మరింతగా పెరుగుతున్నాయి. తాజాగా మంత్రికి సంబందం లేకుండానే నిండ్రం మండలంలోని కొప్పేడు గ్రామంలో రైతుభరోసా కేంద్రం, వెల్ నెస్ కేంద్రం నిర్మాణానికి భూమిపూజ జరిగింది.

ఈ కార్యక్రమంతోనే రోజా మండిపోయారు. తన నియోజకవర్గంలో తనకు సమాచారం కూడా లేకుండానే స్ధానికనేతలు భూమిపూజ కార్యక్రమాన్ని ఎలా చేస్తారంటు నేతలను నిలదీశారు. తర్వాత తన బాధను, ప్రత్యర్ధివర్గం చేస్తున్న పనులను, పార్టీ బలహీనపడటంతో ప్రత్యర్ధివర్గంకు మద్దతిచ్చేట్లుగా జరుగుతున్న కార్యక్రమాలపై ఒక ఆడియోను విడుదలచేశారు. ఈ ఆడియో ఇపుడు పార్టీతో పాటు నియోజకవర్గంలో బాగా వైరల్ అయ్యింది.

రోజా చేసిన తప్పేమిటంటే తన ఆవేధనను ఆడియోరూపంలో విడుదలచేయటమే. తనను లెక్కచేయని బలమైన ప్రత్యర్ధి నియోజకవర్గం నియోజకవర్గంలో ఉందని రోజా తనంతట తానుగా అంగీకరించినట్లయ్యింది. వాస్తవం చెప్పాలంటే రోజాకు బలమైన ప్రత్యర్ధివర్గం కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలం ట్రస్టుబోర్డు ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధరరెడ్డి, ఈడిగ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కేజే శాంతి, ఆమె భర్త కేజే కుమార్ తదితరులతో రోజాకు ఏమాత్రం పడటంలేదు.

ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఒకపుడు వీళ్ళంతా రోజాకు బాగా సన్నిహితులే. ఏదో గొడవల కారణంగా రోజాతో పడక అంతా ఏకమై వ్యతిరేకగ్రూపుగా తయారయ్యారు. వీళ్ళని రోజా ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళకి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డితో కూడా డైరెక్టుగా యాక్సెస్ ఉంది. అందుకనే రోజా ఎంత వ్యతిరేకించినా చక్రపాణిరెడ్డి ట్రస్టుబోర్డు ఛైర్మన్ గాను, కేజే శాంతి ఈడిగ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా అపాయింటయ్యారు.

రోజా గనుక వీళ్ళతో పంచాయితీని సెట్ చేసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవటం కష్టమనే అభిప్రాయాలు పెరిగిపోతున్నాయి. ఈరోజు రోజా మంత్రి అయితే అవచ్చు. గొడవలకు ఎవరు కారణమనేది పక్కన పెట్టేసి ప్రత్యర్ధివర్గంతో సయోధ్యకోసం రోజాయే చొరవ చూపాల్సుంటుంది. అవసరమైతే కొన్ని మెట్లు తగ్గాలి వేరే దారిలేదు. లేకపోతే మొదటికే మోసం వచ్చేస్తుందేమో.