మునుగోడులో పోస్టర్ల కలకలం

ఊపందుకుంటున్న మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా కలకలం మొదలైంది. కారణం ఏమిటంటే నియోజకవర్గంలో కీలకమైన చండూరు మండలం కేంద్రంలో బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పోస్టర్లు వెలవటమే. ఈ పోస్టర్లను ఎవరు వేశారో తెలీదు. రాజగోపాలరెడ్డి ప్రతిఓటుకు వేలాది రూపాయలు ఇవ్వటానికి రెడీ అయ్యారని, కావాల్సిన వారు పలానా నెంబర్ కు ఫోన్ చేయండంటు ఫేన్ పే మొబైల్ నెంబర్ ఇచ్చున్నారు.

ఫోన్ పే రూపంలో కాంట్రాక్ట్ పే అని పోస్టర్లలో ఉంది. రు. 18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు తీసుకున్నారు కాబట్టి ఓటుకు ఎంత డబ్బైనా ఇవ్వటానికి రాజగోపాలరెడ్డి రెడీ అన్నట్లుగా పోస్టర్లలో ఉంది. నియోజకవర్గంలోని చండూరు పట్టణంలో వేలాది పోస్టర్లు అతికించారు. మొదటినుండి కూడా రాజగోపాల్ కేవలం కాంట్రాక్టుల కోసమే కాంగ్రెస్ ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారని స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే ఆరోపించారు.

అక్కడినుండి చాలామంది మాజీ ఎంఎల్ఏపై ఇదే విదమైన ఆరోపణలు చేస్తున్నారు. ఒకదశలో తనపై ఆరోపణలను రాజగోపాల్ తిప్పికొట్టారు. అయితే ఆయనకు ఛత్తీస్ ఘర్లో బొగ్గు కాంట్రాక్టు రావటం, కొద్దిరోజులకే కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరటం లాంటివి జరగటంతో జనాల్లో కూడా ఇదే విషయం బాగా రిజస్టర్ అయిపోయింది. దీనికితోడు మూడురోజుల క్రితం రాజగోపాల్ మాట్లాడుతు తనకు బొగ్గుగనులు దక్కినమాట వాస్తవమే అని అంగీకరించారు. పైగా తన గెలుపుకోసమే తన అన్న, కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనిచేస్తారని మీడియా సమావేశంలోనే ప్రకటించారు.

దాంతో బ్రదర్స్ ఇద్దరికీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా మామూలు జనాల్లో కూడా చర్యలు పెరిగిపోతున్నాయి. సరిగ్గా ఈ నేపధ్యంలోనే బీజేపీ అభ్యర్ధికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలవటటం సంచలనంగా మారింది. వ్యక్తిగతంగా అభ్యర్ది ఆర్ధికంగా పటిష్టమైన స్ధితిలో ఉన్నారు కాబట్టి ఓటుకునోటుకు పంచటంలో ఎలాంటి లోటుండదని అందరికీ తెలుసు.