పిఠాపురం-తిరుప‌తి-కాకినాడ.. ఏది బెట‌ర్‌? ప‌వ‌న్ వ్యూహం!

గ‌త ఎన్నిక‌ల్లో ఊహించ‌ని విధంగా త‌గిలిన ఎఫెక్టో…లేక‌..వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ విజ‌యం దక్కించుకుని.. అసెంబ్లీలో అడుగు పెట్టాల‌నే ల‌క్ష్య‌మో మొత్తానికి.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ఇప్ప‌టి నుంచే దృష్టి పెట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునే వ్యూహంలో భాగంగా.. మూడు నియోజ‌క‌వ‌ర్గాలను ప్రాథ‌మికంగా ఎంపిక చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. వీటిలో కాపు సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని రెండు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.

అవే.. పిఠాపురం, కాకినాడ రూర‌ల్‌. ఇక‌, మెగా అభిమాన‌గ‌ణం ఎక్కువ‌గా ఉన్న తిరుప‌తి అసెంబ్లీ నియోజకవ‌ర్గం. గ‌తంలో ఇక్క‌డ చిరంజీవి కూడా విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌పై జ‌న‌సేన ఇప్ప‌టికే దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌.. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల ఓట‌రు లిస్టుల‌ను సేక‌రించారు.. అదేవిధంగా.. సామాజిక వ‌ర్గాల ప్ర‌భావం కూడా.. ప‌రిశీలించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని భీమ‌వ‌రం, విశాఖ జిల్లాలోని గాజువాక నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేసి.. ఓడిపోయారు. అయితే.. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప‌క్క‌న పెట్టారు. కొత్త‌గా మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఎంపిక చేసుకోవ‌డం వెనుక‌.. త‌న సొంత సామాజిక వ‌ర్గం డిమాండ్ తో పాటు.. మెగా అభిమానుల ఒత్తిడి కూడా ఉంద‌ని తెలుస్తోంది. కాకినాడ రూర‌ల్ నుంచి వైసీపీ నాయ‌కుడు.. మాజీ మంత్రి.. కుర‌సాల క‌న్న‌బాబు(కాపు) ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

ఇక్క‌డ కాపులు ఎక్కువ‌. సో.. ఇక్క‌డ ప‌వ‌న్ గెలుపుపై అంచ‌నాలు వ‌స్తున్నాయి. పిఠాపురం ప‌రిస్థితి కూడా అలానే ఉంది. తిరుప‌తిలో గ‌తంలో మెగా స్టార్ విజ‌యం ద‌క్కించుకున్నారు. అప్ప‌ట్లో రెండు చోట్ల పోటీ చేసి.. తిరుప‌తి నుంచి విజ‌యం సాధించారు. ఇప్పుడు ఇక్క‌డ‌ కూడా ప‌వ‌న్‌కు సాన‌కూల అంశాలు ఉన్నాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. యాదృచ్ఛికంగా.. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ..టీడీపీ అంత బ‌లంగా లేక‌పోవ‌డం.. ఉన్నా.. అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌క‌పోవ‌డాన్ని బ‌ట్టి.. ఈ మూడు చోట్ల‌లో రెండు స్థానాల‌ను ప‌వ‌న్‌కు వ‌దిలేసే ఆలోచ‌న టీడీపీ చేస్తోందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.