టీఆర్ఎస్ టు బీఆర్ఎస్..ప్రస్థానం

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి అఫీషియల్ గా తన పార్టీతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అసలు పార్టీ ఎలా పుట్టింది? టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ ప్రస్థానం ఏమిటి అన్న చర్చ జరుగుతోంది. 2001 ఏప్రిల్ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం దగ్గర తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ పార్టీని కేసీఆర్ ప్రకటించారు. ఆ ఇల్లే కొంతకాలం పార్టీ కార్యాలయంగా కూడా పనిచేసింది.

2004లో పార్టీ సొంత భవన నిర్మాణం ప్రారంభించిన కేసీఆర్ 2006లో సొంత పార్టీ ఆఫీసు ప్రారంభించారు. 2001లో పార్టీ పెట్టే నాటికి టీడీపీ ప్రభుత్వంలో రవాణా శాఖా మంత్రిగా ఉన్న కేసీఆర్….ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేశారు. పార్టీ పెడుతున్న నేపథ్యంలో టీడీపీకి రాజీనామా చేశారు. 2001 సెప్టెంబరులో జరిగిన ఉప ఎన్నికలో సిద్ధిపేట నుంచి కేసీఆర్ గెలిచారు. ఆ తర్వాత ఎన్నో ఉప ఎన్నికల్లో పార్టీ విజయకేతనం ఎగురవేసి…మరింత బలపడింది. అందుకే, టీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలే ఊపిరి అని కేసీఆర్ అంటుంటారు.

పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన తొలిసారిగా వచ్చిన 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. 54 సీట్లలో పోటీ చేసి 26 స్థానాలు గెలిచారు. ఈ సంద్భంగానే నాటి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరీంనగర్ వేదికగా తెలంగాణ ఇస్తామని ప్రకటించారు. 2008లో 16 స్థానాలకు పోటీ చేసి 7 స్థానాలు గెలుచుకున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని 45 స్థానాల్లో పోటీ చేసి 10 గెలుచుకున్నారు. 2010లో 11 స్థానాలకు పోటీ చేసి 11 గెలుచుకోగా…2011 లో ఒక స్థానం, 2012లో ఐదు స్థానాలు గెలిచారు.

2009 సెప్టెంబరులో నాటి సీఎం వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అక్టోబరు 21న సిద్ధిపేటలో ఉద్యోగ గర్జన పేరుతో భారీ సభ నిర్వహించారు. 2009 నవంబర్ 29న సిద్ధిపేట కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ ఉద్యమానికి ఇదే కీలక మలుపు. ఆ ప్రకటన తెలంగాణను నిప్పుల కొలిమి చేసింది. ఆ తర్వాత జైల్లో దీక్ష కొనసాగించారు..ఆ తర్వాత నిమ్స్ కు తరలించడంతో అక్కడా దీక్ష కొనసాగింది.
సిద్ధిపేటలో హరీశ్ రావు కిరోసిన్ పోసుకొని ”తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ చచ్చుడో” అనే నినాదంతో కాంగ్రెస్ తెలంగాణ ఇస్తానని ప్రకటించింది.

ఆ తర్వాత ఎన్నో ఉద్యమాలు చేపట్టిన తర్వాత 2014 ఫిబ్రవరి 14వ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లుకు లోక్‌సభ మూజువాణీ ఓటుతో ఆమోదం తెలిపింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ తేదీగా ప్రకటించింది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేశాయి.


2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ 119లో 63 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త రాష్ట్రానికి కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు.


2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి 89 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకుని 2018 డిసెంబర్‌ 13న ముఖ్యమంత్రిగా రెండోసారి పదవిలోకి వచ్చారు.

2019 లోక్ సభ ఎన్నికలు టీఆర్ఎస్‌ జోరుకు బ్రేకులు వేశాయి. 17 స్థానాల్లో 9 మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. ఈ క్రమంలోనే త్వరలో జరగబోయే అసెంబ్లీ , సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేశారు.