‘ద‌ళిత బంధు’ మాకు న‌చ్చినోళ్ల‌కే ఇస్తాం: మంత్రి అల్లోల క‌ల్లోలం!

మంత్రి అంటే.. ఎంతో కొంత బాధ్య‌తాయుతంగా మాట్లాడాలి. గ‌ల్లీ స్థాయి నేత‌ల మాదిరిగా.. ఎలాంటి బాధ్య‌తా లేకుండా మాట్లాడితే.. ఎలా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. ఎందుకంటే.. వారివ‌ల్లే.. ప్ర‌జ‌లు అంతో ఇంతో ప్ర‌భావితం అవుతారు. పార్టీ అధిష్టానాలపై ఒక స‌ద‌భిప్రాయం ఏర్ప‌డుతుంది. కానీ, ఇటీవ‌ల కాలంలో తెలంగాణ‌లోని టీఆర్ఎస్ మంత్రులు దారిత‌ప్పేస్తున్నారు. ఎవ‌రి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వారు మాట్లాడుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

తాజాగా మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు.. మ‌రింత‌గా మంట‌లు రేపుతున్నాయి. అధికార పార్టీని బ‌జారుకు లాగేసిన‌ట్టుగా ఆయ‌న వ్యాఖ్యానించార‌ని ప‌రిశీల‌కులు సైతం చెబుతున్నారు. దీంతో పార్టీ ఇప్పుడు దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగుతుందా? లేక‌.. చూస్తూ కూర్చుంటుందా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత‌కీ.. అల్లోల ఏమ‌న్నారంటే..”మా ఇష్టం వచ్చినోళ్లకే దళితబంధు ఇస్తాం.. నువ్వెందుకు అట్ల మాట్లాడుతున్నవ్‌.. పోలీసులూ.. ఆమెను బయటకు తీసుకెళ్లండి” అంటూ దళిత మహిళపై మంత్రి అల్లోల ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌(జి)లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ చీరల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన పలువురు దళిత మహిళలు జోక్యం చేసుకొని.. దళితబంధుపై మంత్రి నిలదీశారు. గరీబోళ్లకు దళితబంధు అందట్లేదంటూ ఓ దళిత మహిళ సమావేశంలోనే మంత్రి అల్లోలను ప్రశ్నించింది.

దీంతో మంత్రి ఆమెపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా ఇష్టం వచ్చినోళ్లకే దళితబంధు ఇచ్చు కుంటాం.. నువ్వెందుకు అట్ల మాట్లాడుతున్నవ్‌.. ఇక్కడి నుంచి బయటకు వెళ్లు’ అంటూ మండిపడ్డారు. అంతటితో ఆగకుండా ‘ఆమెను బయటకు తీసుకెళ్లండి..’ అంటూ పోలీసులను ఆదేశించారు. బీజేపీ వాళ్లతో తిరిగేవాళ్లు, బీజేపీ నేతలనే దళితబంధు అడగాలని చెప్పారు.

రాష్ట్రమంతటా విడతల వారీగా దళిత బంధు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే అర్హులందరికీ దళిత బంధు ఇస్తామని.. అంతవరకు ఓపికగా ఉండాలని మహిళలకు సూచించారు. కాగా, మంత్రి అల్లోల వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నోటికి నల్ల గుడ్డలు ధరించి నిరసన తెలిపారు. మ‌రి పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.