చంద్ర‌బాబు ఓట‌మి సాధ్య‌మేనా?.. కుప్పంపై వైసీపీ దుస్సాహ‌సం?

కుప్పంలో చంద్రబాబును ఓడించి.. ఎలాగైనా ఈ సారి పాగా వేయాలని ఒక టార్గెట్‌ను జగన్ ఫిక్స్ చేసుకున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ టార్గెట్‌కు అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తున్నట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. అయితే ఇది సాధ్య‌మేనా? మూడు ద‌శాబ్దాల‌కు పైగా.. చంద్ర‌బాబు వెంట న‌డుస్తున్న జ‌నాలు.. జ‌గ‌న్‌ను న‌మ్మే ప‌రిస్థితి ఉందా? ఇదీ.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. తాజాగా సీఎం జగన్ కుప్పంలో ప‌ర్య‌టించారు. ఇక్క‌డి ఎమ్మెల్యే గురించి మాట్లాడ‌తాను.. అంటూ.. చంద్రబాబును విమర్శించడానికే జగన్ సమయమంతా కేటాయించారు. చంద్రబాబు అలా చేశారు.. ఇలా చేశారంటూ విమర్శల బాణాలు సంధించడంపైనే దృష్టి సారించారు.

కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్ల పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. రూ.11 కోట్లతో ప్రభుత్వ ఆఫీస్‌ కాంప్లెక్స్‌‌ను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో జగన్ మాట్లాడుతూ.. “కుప్పంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. కుప్పం ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు. కుప్పం అంటే చంద్రబాబు పరిపాలన కాదు. వైసీపీ పాలనలో ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది. కుప్పం అంటే అక్కచెల్లెమ్మల అభివృద్ధి. కుప్పం ఎమ్మెల్యే చంద్ర‌బాబు హైదరాబాద్ కు లోకల్‌. కుప్పానికి చంద్రబాబు నాన్‌ లోకల్‌. కుప్పానికి ఆయన చేసిందేమీ లేదు. తనకు కావాల్సింది కుప్పం నుంచి పిండుకున్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పంలో కరువు సమస్యను పరిష్కరించలేదు” అన్నారు.

అయితే.. ఇదే ఒక్క‌సారి జ‌గ‌న్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పులివెందుల‌కు కూడా వ‌ర్తిస్తాయ‌నేది.. ప‌రిశీల‌కుల మాట‌. ఎందుకంటే.. 40 ఏళ్ల‌కు పైగానే.. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్ కుటుంబం విజ‌యం ద‌క్కించుకుంటోంది. అయితే.. చంద్ర‌బాబు ఇటీవ‌ల ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు.. పులివెందుల‌కు.. ప‌ట్టిసీమ నుంచి నీటిని ఇచ్చేవర‌కు ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు సాగు నీరు, తాగునీరు లేదు. సీసీ రోడ్లు కూడా.. చంద్ర‌బాబు హ‌యాంలోనే నిర్మించారు. మ‌రి దీనిని సీఎం జ‌గ‌న్ ఏమంటారు? అనేది ప‌రిశీల‌కుల ప్ర‌శ్న‌.

ఇక‌, కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు… కుప్పానికి కనీసం నీళ్లు కూడా తీసుకురాలేదని జ‌గ‌న్ అన్నారు. మున్సిపాలిటీలో కనీసం డబుల్‌ రోడ్డు కూడా వేయలేదన్నారు. కృష్ణగిరి- పలమనేరు హైవే పనుల్ని చేయలేదని, కుప్పంలో ఎయిర్‌పోర్టు కడతామని చెవుల్లో పూలు పెట్టారని చెప్పారు. ప్రజల ఒత్తిడితో రెవెన్యూ డివిజన్‌ కోసం త‌న‌కు చంద్రబాబు లేఖ రాశారని తెలిపారు. ఇంతకన్నా చేతకాని నాయకుడు ఎక్కడైనా ఉంటారా? ఒక్కసారి కూడా కుప్పం సీటు బీసీలకు ఇవ్వలేదని అన్నారు.

అయితే.. వైఎస్ కుటుంబానికి ప‌టిష్ట‌మైన జిల్లాగా చెప్పుకొనే.. క‌డ‌ప‌లోనూ వైసీపీ ఇదే క‌దా చేస్తోంది? ఇక్క‌డ కూడా.. రాజంపేట‌.. రైల్వేకోడూరు వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టికీ అభివృద్ధి లేద‌నేది ప‌రిశీల‌కుల మాట‌. ఏదేమైనా.. చంద్ర‌బాబును ఏదో అనేసి.. రెండు రాళ్లు వేసేస్తే.. కుప్పంలో గెలిచేస్తామ‌ని అనుకోవ‌డం.. దుస్సాహ‌స‌మేన‌ని అంటున్నారు.