సీఎం అవుదామనుకుంటే ఇలాగైపోయిందే ?

రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోదామని అనుకున్న మత ప్రభోదకుడు కేఏ పాల్ కు కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద షాకే ఇచ్చింది. పాల్ పెట్టిన ప్రజాశాంతి పార్టీ గుర్తింపును కమీషన్ రద్దు చేసింది. దేశంలో క్రియాశీలంగా లేని రాజకీయ పార్టీలను కమీషన్ గుర్తించింది. 537 పార్టీలు పేరుకు మాత్రమే ఉనికిలో ఉన్నాయని నిజానికి వాటి తరపున ఎలాంటి కార్యకలాపాలు జరగటం లేదని నిర్ధారణకు వచ్చింది. ఇలాంటి పార్టీలన్నింటినీ ఒకే దెబ్బతో గుర్తింపు రద్దు చేసేసింది.

కమీషన్ దెబ్బకు గుర్తింపు కోల్పోయిన పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో 20 దాకా ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో జనాలకు కాస్త తెలిసిన పార్టీ కేఏ పాల్ ఏర్పాటుచేసిన ప్రజాశాంతిపార్టీ మాత్రమే. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి వచ్చేస్తానని ఒకసారి, ఏపీలో తమదే అధికారం అని మరోసారి మీడియాతో పాల్ ఎన్నో సార్లు చెప్పారు. పాల్ మీడియా సమావేశాలంటే జర్నలిస్టులకు పెద్ద రిలీఫ్ లాగ ఫీలవుతారు. 24 గంటలూ టెన్షన్లో ఉండే జర్నలిస్టులకు పాల్ కాసింత వినోదాన్ని పంచుతుంటారు.

ఒకసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తన పార్టీలో కలిపేయమని బంపర్ ఆఫర్ ఇచ్చారు. చంద్రబాబునాయుడు తనతో చేతులు కలిపితే అధికారంలోకి ఈజీగా వస్తారంటు ఊదరగొట్టారు. తాను ముఖ్యమంత్రి అయితే ఏపీకి లక్షల కోట్ల రూపాయలను తీసుకొచ్చి నెలల వ్యవధిలోనే డెవలప్ చేసి చూపిస్తానని ఎన్నోసార్లు చెప్పారు. అలాగే తెలంగాణాలో డెవలప్ చేయటం కేసీయార్ వల్ల కాలేదన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అంటే ఏమిటో చేసి చూపిస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం మాత్రమే తనదే అంటు పదే పదే చెప్పారు. ఇపుడే తనతో పొత్తు పెట్టుకుంటే అధికారంలోకి రావచ్చని మిగిలిన పార్టీలకు బంపరాఫర్ కూడా ఇచ్చారు. తానేమిటో, తన పార్టీ ఏమిటో తెలుసుకోకుండానే జనాల దృష్టిలో తనకు ఎలాంటి ఇమేజి ఉందో కూడా పాల్ ఏరోజూ చూసుకోలేదు. మొత్తానికి ముఖ్యమంత్రి అయిపోదామని అనుకుంటున్న పాల్ పార్టీని కమీషన్ ఏకంగా రద్దుచేయటంతో ఇక ఆయన సీఎం ఎలాగవుతారో ఏమిటో ?