రాష్ట్రానికి ప్ర‌త్యేక గీతం, జెండా కూడా: రేవంత్

తెలంగాణ వచ్చాక ‘జయజయహే తెలంగాణ’ పాటను కాలగర్భంలో కలిపారని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆ పాటను రాష్ట్ర అధికారిక గీతంగా ఆమోదిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. జాతీయ జెండాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక జెండా రూపొందించాలని ప్రతిపాదనలు వచ్చాయని, ఆదిశ‌గా కూడా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి విజయం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి ఐదు దశాబ్దాల పాటు మునుగోడు, కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో సేవ చేశారన్నారు.

గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్‌ 17న నిర్వహించే కార్యక్రమాలు, మునుగోడు ఉప ఎన్నిక, భారత్‌ జోడో యాత్ర అజెండా తదితర అంశాలపై నేతల సూచలను కోరారు. ఈ సందర్భంగా రేవంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

“సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం పేరిట మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ చూస్తోంది. ఇందుకోసం కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నారు. ఆనాడు రాచరిక పాలన నుంచి ప్రజలకు స్వేచ్ఛను అందించిన పార్టీ కాంగ్రెస్. మన పేటెంట్‌ను బీజేపీ, టీఆర్ఎస్‌ హైజాక్‌ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజాన్ని నిట్టనిలువునా చీల్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంది. చరిత్రను కనుమరుగు చేసి కేసీఆర్‌ తనకు అనుకూలంగా రాసుకొంటున్నారు. టీఆర్‌ఎస్‌కు పర్యాయపదంగా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం కేసీఆర్ టీఎస్ అని తీసుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దీన్ని సవరించి టీజీ పెట్టుకోవాలనేది ఒక ప్రతిపాదన” అని రేవంత్ చెప్పారు.

సబ్బండ వర్గాలను ప్రతిబింబించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరముంద‌న్నారు. జాతీయ జెండాతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యేక జెండా ఉండాలనే ప్రతిపాదనపై సూచన‌లివ్వాల‌న్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో పని చేసేందుకు 8 యూనిట్లుగా విభజించి నాయకులకు బాధ్యతలు నిర్ణయించామ‌ని తెలిపారు. 300బూత్‌లను చూసుకోవడానికి 150 మందిని నియమించాలని పార్టీ భావిస్తోందన్నారు. ఎన్నికల్లో ఆ రెండు(బీజేపీ-టీఆర్ ఎస్‌) పార్టీలూ అడ్డగోలుగా ధనబలాన్ని ఉపయోగిస్తాయని, కాంగ్రెస్ మాత్రం క్షేత్ర స్థాయిలో వాటిని ఓడించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.

అక్టోబ‌రులో తెలంగాణ‌లో జోడో యాత్ర‌

భారత్ జోడో యాత్ర దేశంలోనే ప్రకంపనలు సృష్టిస్తోందని రేవంత్ అన్నారు. రాహుల్‌కు వస్తోన్న ఆదరణ చూడలేకే బీజేపీ చిల్లర మల్లర ప్రచారానికి దిగుతోందని ధ్వజమెత్తారు. అక్టోబర్ 24న రాహుల్ యాత్ర తెలంగాణకు రాబోతోందని పేర్కొన్నారు. 15 రోజులపాటు తెలంగాణలో భారత్ జోడో యాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. మక్తల్ నుంచి మద్నూర్ వరకు 350 కిలోమీటర్లు యాత్ర సాగుతుందన్నారు. మూడు పెద్ద సభలు నిర్వహించాలనుకంటున్నామన్నారు.