ఇటు రైతులు.. అటు ఏపీ ప్ర‌భుత్వం.. పాద‌యాత్ర నేటి నుంచే!

అమరావతి రైతుల రెండో విడత మహాపాదయాత్రకు సర్వం సిద్ధమైంది. రాజధానిలోని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి చెందిన‌ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అరసవెల్లి సూర్యదేవుని సన్నిధి వరకూ జరిగే యాత్ర కోసం రైతులు, రైతుకూలీలు ఉత్సాహంతో ఉన్నారు. సోమవారం ఉదయం ప్రారంభమయ్యే యాత్ర 60 రోజుల పాటు జరగనుంది. తమకు జరిగిన అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్లటంతో పాటు.. అమరావతి ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయటమే లక్ష్యంగా పాదయాత్ర జరుగుతుందని రైతులు చెబుతున్నారు.

అయితే.. అదేస‌మ‌యంలో స‌ర్కారు కూడా స‌ర్వ‌స‌న్న‌ద్ధంగా ఉంద‌ని తెలుస్తోంది. ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా..పాద‌యాత్ర‌కు బ్రేక్ ప‌డేలా చేయాల‌నే వ్యూహం క‌నిపిస్తోంద‌ని రైతులు సైతం అనుమానిస్తున్నారు. ఇప్ప‌టికే భారీ ఎత్తున పోలీసుల‌ను మోహ‌రించే లా.. జిల్లాస్థాయిలో ఆదేశాలు వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. అంటే.. మొత్తంగా హైకోర్టు ఆదేశాల‌ను పాటిస్తూనే.. మ‌రోవైపు తాము చేయాల‌నుకున్న‌ది చేసేలా.. వ్యూహాత్మ‌కంగా వైసీపీ నేత‌లు చ‌క్రం తిప్పుతున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే కొంద‌రు మంత్రులు రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏదైనా జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని రైతులు అనుమానిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. పాద‌యాత్ర‌ను ఆపేది లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

అకుంఠిత దీక్ష‌..!

రాజధాని కోసం భూములిచ్చిన రైతులు సర్కారుపై మలి విడత ఉద్యమానికి సిద్ధమయ్యారు. సోమవారం ఉదయం 5గంటలకు తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభిస్తారు. ఉదయం 6 గంటల 3 నిమిషాలకు పండితులు నిర్ణయించిన సుముహుర్తాన రైతుల తొలి అడుగులు వేయనున్నారు. అయితే రైతులంతా ఎక్కువమంది వెంకటపాలెంలో కలుస్తారు. అక్కడి నుంచి అరసవెల్లికి రాజధాని రైతుల యాత్ర సాగనుంది.

యాత్రలో ముందుభాగాన తిరుమలేశుడు భూదేవి, శ్రీదేవి సమేతునిగా రథంలో కొలువుదీరనున్నారు. అలాగే సూర్యదేవుని విగ్రహాన్ని రథం ముందుభాగంలో ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత రాజ్యాంగ నిర్మాత‌ అంబేద్కర్ చిత్రపటంతో దళిత జేఏసీ, ఆ వెంటనే మహిళలు, వారి తర్వాత రైతులు, రైతు కూలీలు అనుసరిస్తారు.

ఆది నుంచి 60వ రోజు వ‌ర‌కు..

మొదటి రోజున వెంకటపాలెం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా పాద‌యాత్ర మంగళగిరికి చేరుకొంటుంది. మంగళగిరిలోని కల్యాణ మండపాల్లో రైతులు రాత్రి బస చేయనున్నారు. గుంటూరు జిల్లాలో పాదయాత్ర 9 రోజుల పాటు జరగనుంది. 60 రోజుల పాటు జరిగే పాదయాత్రలో 9 సెలవు దినాలుంటాయి. నవంబర్ 11న పాదయాత్ర ముగియనుంది. మొత్తం 900కిలోమీటర్లకు పైగా పాదయాత్ర సాగనుంది.

గుంటూరుతో పాటు కృష్ణా, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కలిసేలా పాదయాత్రకు రూపకల్పన‌ చేశారు. మార్గంమధ్యలో మోపిదేవి, ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకుని రైతులు అరసవెల్లి చేరుకుంటారు. 12 పార్లమెంట్, 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగనుంది. అమరావతిపై హైకోర్టు తీర్పుని అమలు చేయని ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగడతామని రైతులు చెబుతున్నారు.