టీఆర్ఎస్-కాంగ్రెస్ కలుస్తాయా ?

ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో టీఆర్ఎస్-కాంగ్రెస్ చేతులు కలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే పై బలమైన పోరాటం చేయాలంటే నాన్ ఎన్డీయేపార్టీలు+యూపీయే చేతులు కలపాల్సిన అవసరం ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మొన్నటి భేటీలో కేసీయార్ కు చాలా గట్టిగా చెప్పారట. జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ తో చేతులు కలపకుండా ఎన్డీయే మీద పోరాటం ఎప్పటికీ సక్సెస్ కాదని కూడా నితీష్ స్పష్టంగా చెప్పారట.

నితీష్ చెప్పిన మాటలకు కేసీయార్ సానుకూలంగానే స్పందించారని సమాచారం. అయితే కాంగ్రెస్ తో చేతులు కలపటం ఇప్పటికిప్పుడు సాధ్యంకాదని కూడా చెప్పారట. ఎందుకంటే తొందరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మీద బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా పెద్దఎత్తున పోరాటం చేస్తోంది. కేసీయార్ ను గద్దెదింపి అధికారంలోకి రావటానికి కాంగ్రెస్ కూడా పెద్ద ప్రయత్నాలే చేస్తోంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ తో చేతులు కలపటం ఇప్పట్లో సాధ్యంకాదని నితీష్ కు కేసీయార్ స్పష్టంచేశారట.

కావాలంటే 2023 ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో చేతులు కలిపే విషయం ఆలోచిస్తానని చెప్పారట. నరేంద్రమోడీని గద్దె దింపటం తనకు ఎంతముఖ్యమో తెలంగాణాలో అధికారంలోకి రావటమూ అంతే ముఖ్యమని కేసీయార్ తేల్చిచెప్పారట. దాంతో నితీష్ కూడా కేసీయార్ వాదనను కొట్టిపారేయలేకపోయారని టీఆర్ఎస్ నేతలంటున్నారు.

ఇందుకనే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ తో టీఆర్ఎస్ చేతులు కలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. నాన్ ఎన్డీయే పార్టీల్లో ఐకమత్యం ఎంతగా ఉంటే అంత బలమైన ప్రతిపక్షమం తయారవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే నితీష్ ప్రతిపాదనలకు చాలాపార్టీల అధినేతలు సానుకూలంగానే స్పందించారట. కేసీయార్ తో మాట్లాడినట్లే తొందరలోనే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో కూడా నితీష్ మాట్లాడబోతున్నారట. మరి దీదీ ఎలాగ స్పందిస్తుందో చూడాల్సిందే.