పవన్ ను ఏకాకిని చేసిన బీజేపీ?

ఆంధ్రప్రదేశ్ లో 2024 సార్వత్రిక ఎన్నికల వేడి ఆల్రెడీ రాజుకున్న సంగతి తెలిసిందే. సర్వేలు, రిపోర్టులు, ప్రోగ్రెస్ కార్డులతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ బిజీబిజీగా ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపే పరమావధిగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ మాత్రం సింగిల్ గానే పోటీచేసేందుకు సిద్ధమవుతుండగా… పొత్తులు, ఎత్తులు, పై ఎత్తులపై టీడీపీ, బీజేపీ, జనసేనలు మల్లగుల్లాలు పడుతున్నాయి.

ఎన్డీఏలో చేరేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని ప్రచారం జరుగుతుండగా… సమయం, సందర్భాన్ని బట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తులపై నిర్ణయం ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా చెప్పారు. ఇక, టీడీపీతో దోస్తీకి బీజేపీ ఉవ్విళ్లూరుతున్న నేపథ్యంలోనే జనసేనను బీజేపీ పెద్దలు లైట్ తీసుకున్నారన్న టాక్ వస్తోంది. పైగా, వైసీపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేని జనసేన… టీడీపీతో లేదా బీజేపీతో పొత్తు పెట్టుకోక తప్పదన్న భావనలో బీజేపీ పెద్దలున్నారట.

అందుకే, జనసేనను బీజేపీలో విలీనం చేస్తేనే… పవన్ ను పట్టించుకుంటామని తేల్చి చెప్పేశారట. బీజేపీలో విలీనమైతే పవనే సీఎం అభ్యర్థి అని ప్రకటించాలని జనసేన నేతలు కోరకుంటున్నారట. కానీ, అందుకు బీజేపీ పెద్దలు సుముఖంగా లేకపోవడంతో కొంతకాలంగా జనసేనను బీజేపీ అసలు పట్టించుకోడం లేదట. జనసేన ఒంటరిగా పోటీచేసి గెలవడం అసాధ్యమని బీజేపీ ఫిక్సయిందట. అందుకే, పవన్ ను నిర్లక్ష్యం చేస్తున్నారట.

తాము చెప్పినట్లు పవన్ నడుచుకోవాలన్న ధోరణిలో బీజేపీ అగ్రనేతలున్నారట. అందుకే, తమతో పొత్తు పెట్టుకున్న తర్వాత పార్టీ విలీనం ప్రతిపాదన పెట్టి పవన్ ను ఇరకాటంలో పడేశారట. అంతేకాదు, జనసేనను నిర్వీర్యం చేసే దిశగా వ్యూహాలు కూడా బీజేపీ నేతలు అమలు పరిచారని టాక్ వస్తోంది. అందుకే, టీడీపీతో పొత్తుకు జనసేన వెళ్లే అవకాశాలున్న నేపథ్యంలోనే చంద్రబాబుతో మోడీ భేటీ అయి ఎన్డీఏలోకి ఆహ్వానించారట.

దీంతో, పవన్ ను ఒంటరిగా చేసి…తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలన్నది బీజేపీ అగ్రనేతల వ్యూహమట. పవన్ ను సీఎంగా ప్రకటిస్తే టీడీపీ మద్దతు బీజేపీకి ఉండదు. రాష్ట్రంలో టీడీపీ బలపడుతున్న క్రమంలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే లాభం ఎక్కవన్న ధోరణిలో బీజేపీ ఉందట. ఏది ఏమైనా… పవన్ ను బీజేపీ ఏక్ నిరంజన్ ను చేసిందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.