వ‌రంగ‌ల్ కారు జోరు.. క‌మ‌లం దూకుడు

ఉద్య‌మాల‌కు పురిటి గ‌డ్డ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా సాగినప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో కారు జోరుకు బ్రేకులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు ప‌రిశీల‌కులు. సగం సీట్లలో పాగా వేసేందుకు విపక్షాలు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయని చెబుతున్నారు.  

వరంగల్ జిల్లాలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ టీఆర్ ఎస్‌ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ సీట్లు, 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒక్క ములుగు అసెంబ్లీ సెగ్మెంట్‌ మినహా మిగిలినవన్నీ అధికార‌ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి కారెక్కారు.

తర్వాత జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఏకపక్షంగా వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి పరిషత్‌లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. కొన్నాళ్ల కింద‌ట‌ ప్రశాంత్ కిషోర్ టీమ్ నిర్వహించిన సర్వేలో ఉమ్మడి జిల్లాలో ఐదారు అసెంబ్లీ స్థానాల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న ట్లు తేలింది.

దీంతో అలెర్ట‌యిన‌.. పార్టీ అదిష్టానం ఉమ్మడి జిల్లాలో పట్టు కోల్పోకుండా టీఆర్ఎస్‌.. బలపడేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తోంది. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టడంతోపాటు.. ఎదుటి శిబిరంలో కాస్త ప్రజాదరణ ఉన్న నేతను.. తమవైపు లాగేందుకు వ్యూహాలు రచిస్తోంది.

ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను గెలిచిన చరిత్ర ఉండటంతో.. మరోసారి ఆ స్థాయిలో ఆ స్థాయిలో సీట్లు సాధించాలని బీజేపీ కూడా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నాయకులతో రహస్య మంతనాలు జరుపుతూ.. వారిని క‌మ‌లం గూటికి ఆహ్వానించేందుకు తెగ శ్రమిస్తున్నారు.

బీజేపీ ఎత్తుగడలు తెలుసుకున్న టీఆర్ఎస్‌ నాయకులు ఆ పార్టీ వాళ్లనే టీఆర్ఎస్‌లోకి లాగే ప్రయత్నాలు ప్రారంభించారు. చిన్న స్థాయి నేతలకు వల వేస్తే లాభం లేదనుకున్నారో ఏమో.. గతంలో ఆర్ఎస్ఎస్‌, ఏబీవీపీల్లో ఫుల్‌ టైమర్స్‌గా పనిచేసి.. ప్రస్తుతం బీజేపీలో యాక్టివ్‌గా ఉన్న నేతలకే గురి పెట్టారని జిల్లాలో టాక్ న‌డుస్తోంది.  ఇలా వరంగల్‌ అర్బన్‌ ప్రాంతానికి చెందిన కొందరిని ఆకర్షించారు. ఇటీవల బీజేపీ నగర అధ్యక్షునితో పాటు, ఒక కార్పొరేటర్ ను కారెక్కించుకున్నారు.

అదేస‌మ‌యంలో టీఆర్ఎస్‌ నుంచి అసంతృప్తులు ఎవరూ కమలం శిబిరం వైపు చూడకుండా వ్యూహ రచన చేశారు. ఇక‌, వరంగల్ రైతు డిక్లరేషన్ సభతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ రచ్చబండతో గ్రామస్థాయిలో బలపడే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ కృషితో పార్టీ బలం కాస్త పెరుగుతున్నా..దానికి ఆదిలోనే గండికొట్టేలా కమలం, కారు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ బలం కాస్త పెరుగుతున్న ట్లనిపిస్తున్నా..గ్రూప్ రాజకీయాలే ఆ పార్టీ కొంపముంచే పరిస్థితులు కనిపిస్తున్నాయి.