కుప్పంలో హైటెన్షన్‌ .. బాబుకు చుక్కలు చూపించారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనకు తొలిరేజే ఆటంకాలు సృష్టించిన వైసీపీ నాయ‌కులు.. రెండో రోజు మరింత అలజడికి యత్నిస్తున్నారు. రామకుప్పం పర్యటనలో తమపై దాడి చేశారంటూ నిరసన ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమైంది. ఈమేరకు కార్యకర్తలంతా కుప్పం రావాలని వైసీపీ నాయకులు వాట్సప్ సందేశాలు పంపారు. అలాగే ప్రైవేటు విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు.. చలో కుప్పం చేపట్టాలని నిర్ణయించారు. ఈమేరకు నియోజకవర్గంలోని శ్రేణులు తరలిరావాలని కోరారు.

మ‌రోవైపు.. అధికారులు అత్యుత్సాహం చూపించారు. వైసీపీ బంద్‌కు పిలుపునివ్వ‌గానే.. పోలీసులు స్వ‌యంగా వెళ్లి దుకాణాల‌ను.. పాఠ‌శాల‌ల‌ను మూసేయించారు. ఆర్టీసీ బ‌స్సులు నిలిపివేసింది. ఈ ప‌రిణామాల‌కు తోడు.. టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలను.. వైసీపీ కార్యకర్తలు చించివేశారు. అలాగే ప్యాలెస్‌ రోడ్డులో ఉన్న తెలుగుదేశానికి సంబంధించిన బ్యానర్లు, కౌటౌట్లు ధ్వంసం చేశారు. దీంతో కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ శ్రేణుల అరాచకానికి అన్న క్యాంటిన్ వద్ద చంద్రబాబు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డుపైనే కూర్చుని ధ‌ర్నా నిర్వ‌హించారు. ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు స‌మాధానం చెప్పాల‌ని.. అక్క‌డి నుంచే డీజీపీకి ఫోన్ చేశారు. ఈ ప‌రిణామాల‌తో కుప్పంలో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. నడిరోడ్డుపైన చంద్రబాబు బైఠాయించి నిరసన వ్యక్తం చేయ‌డంతో పోలీసులు ఉన్న‌తాధికారులు హుటాహుటిన అక్క‌డ‌కు చేరుకుని ఆయ‌న‌కు న‌చ్చ‌జెప్పారు. ఎట్ట‌కేల‌కు.. అక్క‌డ ధ‌ర్నాను విర‌మించుకున్న చంద్ర‌బాబు క్యాంటీన్ వ‌ద్ద‌కు చేరుకున్నారు.

మ‌రోవైపు.. కుప్పంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై చంద్ర‌బాబు భ‌ద్ర‌తా సిబ్బంది ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబుకు ఏదైనా జ‌రిగితే.. తాము కాల్పుల‌కు దిగ‌క త‌ప్ప‌ద‌ని .. వారు మౌఖికంగా ప్ర‌క‌టించారు. ఇదే విష‌యాన్ని రాష్ట్ర డీజీపీ స‌హా.. కేంద్ర హోం శాఖ‌కు కూడా వారు సందేశం తెలియ‌జేశారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు భ‌ద్ర‌తా సిబ్బంది.. స్థానికంగా మ‌రింత అలెర్ట్ అయ్యారు. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో.. అనే టెన్ష‌న్ గుప్పిట కుప్పం ఇమిడిపోయింది.