ఫొటో టాక్: ఏపీలో వైసీపీ గ‌ణ‌ప‌తి..

ఏ మాట‌కు ఆమాటే చెప్పుకోవాలి. వైసీపీలో ఉన్నంత మంది స్వామి భ‌క్తులు ఇత‌ర పార్టీలో మ‌న‌కు క‌నిపిం చ‌డం లేదు. అదా.. ఇదా.. అనే తేడా లేదు. ఎవ‌రో చూస్తారు.. ఏదో అంటారు. క‌ల‌డో లేడో అనే సంశ‌యం లేకుండా.. అధినేత మ‌న‌సు మెప్పించేలా.. నాయ‌కులు.. వేస్తున్న క‌లర్స్‌ అన్నీ ఇన్నీ కావు. సృష్టి ఆది యందు అన్న‌ట్టుగా.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో త‌నంత‌ట త‌నే పాఠ‌శాలలు, పంచాయ‌తీ ఆఫీసుల‌కు పార్టీ రంగులు పూసేసింది.

అయితే.. నీవు నేర్పిన విద్యయే.. అంటూ.. అధికారంలో ఉన్న పెద్దల ఆశీస్సుల కోసం.. మిక్కిలి వ‌గ‌రుస్తున్న వైసీపీ నాయ‌కులు.. అందివ‌చ్చిన ప్ర‌తి దానికీ.. పార్టీ రంగులు పూసేస్తూస్తున్నారు. కొన్ని రోజుల కింద‌ట‌.. వైసీపీ నాయ‌కుడు ఒక‌రు.. ప్ర‌కాశం జిల్లాలో చ‌నిపోయారు. అంతిమ యాత్రలో ఆయ‌న‌కు క‌ట్టిన పాడి కూడా.. వైసీపీ రంగులు పూసిన క‌ర్ర‌ల‌తోనే క‌ట్టారు.

ఇది చూసిన‌.. పార్టీ పెద్ద‌లు.. మెచ్చుకున్నారో.. ఈ ప‌ని చేసిన‌ సద‌రు నాయ‌కుడికి.. లేదో తెలియ‌దు కానీ.. దీనిపై భారీ ఎత్తున విమ‌ర్శ‌లైతే వ‌చ్చాయి. క‌ట్ చేస్తే.. ఇప్పుడు మ‌రో రెండు రోజుల్లో రాష్ట్రంలో వినాయ‌క ఉత్స‌వాల‌కు శ్రీకారం చుడుతున్నారు. మ‌రి .. వైసీపీ నేత‌లు.. దీనిని మాత్రం వ‌దిలి పెడ‌తారా? ఇదిగో.. ఈ ఫొటో చూశారుగా.. ఇది వైసీపీ కేంద్ర కార్యాల‌యంలోనే ఏర్పాటు చేసేందుకు.. ఓ ఎమ్మెల్యే రూపొందించిన వినాయ‌క విగ్ర‌హం.

వినాయ‌కుడికి.. కూడా వైసీపీ రంగులు పులిమేసి.. త‌మ పార్టీ పిచ్చిని.. వినాయ‌కుడికి కూడా ప‌ట్టించేసి.. ఇలా త‌యారు చేశారు. వినాయ‌క చ‌వితికి ఇంకా నాలుగు రోజుల స‌మ‌యం ఉంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోను వైర‌ల్ చేస్తున్నారు. ఇక‌, ఇది చూసిన పార్టీ నాయ‌కులు.. టికెట్ల ఆశావ‌హులు కూడా వినాయ‌క విగ్ర‌హాల‌ను ఇలానే త‌యారు చేయించే ప‌నిలో ప‌డినా ఆశ్చ‌ర్యం లేదు. దీనిని చూసిన స‌గ‌టు మాన‌వుడు మాత్రం.. ఇది క‌దూ.. స్వామీ భ‌క్తి అంటే! అంటూ.. బుగ్గ‌లు నొక్కుకుంటున్నారు.