రాజ‌కీయ మంట‌లు.. పోలీసుల మధ్య గొడవ

శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడాల్సిన … ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ‌గా నిల‌వాల్సిన పోలీసులు ఇప్పుడు ఎదురు ప‌డితే చాలు.. కొట్టుకునే ప‌రిస్తితికి చేరుతున్నారు. నువ్వెంత .. అంటే నువ్వెంత‌.. అంటూ.. ఒకరిపై ఒక‌రు కాలు దువ్వుతున్నారు. ఇంత‌కీ ఇది ఎక్క‌డో కాదు.. మ‌న ద‌గ్గ‌రే.. ఏపీ-తెలంగాణ పోలీసులే! ఒక‌రిపై ఒక‌రు కాలు దువ్వుతున్నారు. `నువ్వు నా స‌రిహ‌ద్దు దాటొద్దు..` అని ఒక‌రికి ఒక‌రు ఆదేశాలు జారీ చేసుకుంటు న్నారు. దీనికి కార‌ణం.. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ర‌గులుతున్న రాజ‌కీయ మంట‌లే!

గ‌తంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక స‌మ‌యంలో సాగ‌ర్ నుంచి తెలంగాణ ప్ర‌భుత్వం ఏక‌ప‌క్షంగా జ‌ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసిన విష‌యం గుర్తుందా? ఆ స‌మ‌యంలో రాజ‌కీయంగా తెలంగాణ నాయ‌కులు ఏపీపై విరుచుకుప‌డిన విష‌యం మ‌రిచిపోలేదు క‌దా! అప్ప‌ట్లో ఇరు రాష్ట్రాల పోలీసుల‌కు మ‌ధ్య తీవ్ర యుద్ధం తెర‌మీదికి వ‌చ్చింది. ఒక సంద‌ర్భంలో ఇరు ప‌క్షాలు ఒకరిపై ఒక‌రు లాఠీచార్జీ చేసుకునే వ‌ర‌కు ఉద్రిక్త‌త‌లు చేరుకున్నాయి.

అయితే.. ఈ విష‌యాన్ని నేత‌లు మ‌రిచిపోయారు. కానీ, పోలీసులు మాత్రం ఇంకా వివాదాల నుంచి బ‌య‌ట‌కు రాలేదు. రాజ‌కీయ నేత‌లు ర‌గిల్చిన మంట వారిని ఇంకా వెంటాడుతూనే ఉంది. తాజాగా.. అదే
నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం చోటుచేసుకుంది. డ్యామ్ పై.. తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది, ఏపీ సివిల్ పోలీసులు మధ్య రాకపోకలపై  తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. జలాశయం పైకి ఏపీ చెందిన ఎస్సై వాహనం రావ‌డంతో తెలంగాణ పోలీసులు, సిబ్బంది ఆ వాహ‌నాన్ని అడ్డుకున్నారు.

తెలంగాణ ఎస్పీఎఫ్ బలగాలు ఆంధ్రా పోలీసులను అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త‌ వాతావరణం నెలకొంది.  తరువాత ఏపీ పరిధిలోకి వెళ్లిన తెలంగాణ ప్రత్యేక రక్షక సిబ్బంది వాహనాలకు ఏపీ సివిల్ పోలీసులు చలానా విధించారు. ఈ ప‌రిణామంతో రెండు రాష్ట్రాల పోలీసుల మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే.. ఈ ఘ‌ర్ష‌ణ‌ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు. కానీ, రాజ‌కీయంగా ఏర్ప‌డిన ఈ వివాదం.. ప్ర‌స్తుతానికి స‌మ‌సిపోయింద‌ని భావిస్తున్నా.. భ‌విష్య‌త్తులో మాత్రం మ‌రింత పెరిగే అవ‌కాశం లేక‌పోలేద‌ని అంటున్నారు.