జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అహర్నిశలూ కృషి చేస్తామని చెప్పారు. విధ్వంసకర పాలనను అరికట్టేందుకు అవసరమైతే.. ప్రత్యర్థి పార్టీలతోనూ, శతృవులతోనూ కలుస్తామని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అవసరాన్ని బట్టి.. ప్రజల సమస్యలను బట్టి.. ఒక్కొక్కసారి శతృవులతోనూ కలిసి పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఆఖరి శ్వాస వరకు పని చేస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదనేదే తమ విధానమని చెప్పారు. సమయం వచ్చినప్పుడు ఎన్నికల వ్యూహం చెబుతానని చెప్పారు. ఈ మేరకు తిరుపతి రామానుజపల్లి జీఆర్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞాపనలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
“రాష్ట్రంలో కూడా మూడో ప్రత్యామ్నాయం ఉండాలి. వైసీపీకి, టీడీపీకి కొమ్ము కాసేందుకు మేం సిద్ధంగా లేం. సమాజంలో మార్పు కోసం ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుంటాం. కులం అంటే పిచ్చి మమకారం నాకు లేదు. వైసీపీ నేతలు మంచి చేస్తున్నారో లేదో చెప్పాల్సింది మేం.. వాళ్లు కాదు. అందరూ చేతులు కట్టుకోవాలని కోరుకోవడమే ఆధిపత్య ధోరణి.“ అని పవన్ వ్యాఖ్యానించారు. రాయలసీమలో దళితుల గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. కడప జిల్లాలో పరిశ్రమలు ఎందుకు రావటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రాయలసీమ ప్రజల్లో చైతన్యం, మార్పు రావాలన్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్ ఎక్కువంటారు.. తనకెప్పుడూ అలా కనిపించలేదని చెప్పారు. పాలకులు సమస్యల పరిష్కారంపై, మౌలిక వసతులు, రహదారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో గనులు, అటవీ సంపద దోపిడీ జరుగుతోందని విమర్శించారు. పంచాయతీలకు సక్రమంగా నిధులు ఇవ్వటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థ విధానాలకు ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు, వేధింపులు పెరిగాయన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates