ఎంఎల్ఏ అల్లుడు ఎలా చనిపోయారు?

రాయదుర్గం వైసీపీ ఎంఎల్ఏ కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ రెడ్డి చనిపోయాడు. అమరావతి పరిధిలోని తాడేపల్లి మండల కేంద్రంలోని ఒక అపార్టుమెంటు ఫ్లాటు 101లో మృతుడు ఉంటున్నాడు. మృతుడి తండ్రికి ఒక నిర్మాణ సంస్ధ ఉంది. రాంకీ కంపెనీ వర్కులను ఈ నిర్మాణసంస్ధ సబ్ కాంట్రాక్టుకు తీసుకుని పనులు చేయిస్తుంటుంది. జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాల్లో వర్కులు జరుగుతున్నాయి. ఈ మధ్య కొన్ని రాష్ట్రాల్లో చేసిన పనులకు సంబంధించి బిల్లులు అందలేదని సమాచారం.

వర్కులుచేసినా బిల్లులు అందకపోవటంతో మనీరొటేషన్ విషయంలో ఒత్తిళ్ళు పెరిగిపోతున్నట్లు సమాచారం. మరిపుడు తాడేపల్లిలోని తన అపార్టుమెంటుకు ఎందుకు వచ్చారో తెలీదు. అపార్టుమెంటు మైన్ టైనెన్స్ చూసే నరేంద్రరెడ్డి శుక్రవారం సాయంత్రం వచ్చేటప్పటకి లోపలవైపు తలుపులు వేసుందట. ఎంత పిలిచినా సమాధానం రాకపోయేసరికి అనుమానంతో కిటికీలలో నుండి తలుపులు తెరిచినట్లు నరేంద్ర చెప్పారు. లోపలకు వెళ్ళగానే మంచంపక్కనే నేలపైన పడున్న మంజూనాధరెడ్డి కనిపించినట్లు నరేంద్ర చెప్పారు.

దీంతో స్ధానికుల సాయంతో అంబులెన్సు పిలిపించి రెడ్డిని  ఆసుపత్రిలో చేర్పించారు. అయితే మంజూనాధరెడ్డి ఎప్పుడు, ఎలా చనిపోయారన్నది సస్పెన్సుగా మారింది. ఒకవైపు చేసిన పనులకు బిల్లులు అందక మరోవైపు బ్యాంకుల నుండి ఫైనాన్స్ అందటంలేదట. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచని స్థితిలో టెన్షన్ పెరిగిపోతున్నట్లు మృతుడు తండ్రి చెప్పారు. ఈ నేపధ్యంలోనే 31 ఏళ్ళ మంజునాథ రెడ్డి చనిపోవటంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రాథమిక ఆధారాలు చూస్తే ఆత్మహత్యగా చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఇదే సమయంలో ఆత్మహత్య చేసుకోవాల్సినంతగా పరిస్ధితులు విషమించలేదని కూడా సమాచారముంది. అపార్టుమెంటు చూసుకునే నరేంద్ర ఫ్లాటు 101లోకి వెళ్ళిన కాసేపటికే అంబులెన్సు వచ్చిందని అపార్టుమెంటు కాంపౌండులోని వాళ్ళు చెబుతున్నారు. దాంతో అపార్టుమెంటులో ఏమి జరిగిందో ఎవరు చెప్పలేకపోతున్నారు. ప్రత్యక్ష సాక్షులు లేకపోవటం, ఆత్మహత్య చేసుకున్నారనేందుకు కచ్చితమైన ఆధారాలు లేకపోవటంతో అందరు కన్ఫ్యూజన్లో మునిగిపోయారు. పోలీసులు కూడా ఏమీ మాట్లాడకపోవటంతో అనుమానాలు పెరిగిపోతున్నాయి.