హుందా త‌నం కోల్పోతున్న ఏపీ పాలిటిక్స్‌

అది 1999. న‌ర‌సాపురం పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున ఎంపీ అభ్య‌ర్థిగా క‌నుమూరి బాపిరాజు పోటీ చేశారు. అదే ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిగా ప్ర‌ముఖ న‌టుడు కృష్ణం రాజు బ‌రిలో నిలిచారు. ఇద్ద‌రు నాయ‌కులు కూడా హోరా హోరీ ప్ర‌చారం చేసుకున్నారు. ఒకరి కంటే ఒక‌రు.. రెండాకులు ఎక్కువ‌గానే తిట్టిపోసుకున్నారు. విమ‌ర్శ‌లు ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో హోరెత్తించారు. ఎన్నిక‌లు ముగిశాయి. కృష్ణం రాజు విజ‌యం ద‌క్కించుకున్నారు. బాపిరాజు ఓడిపోయారు.

క‌ట్ చేస్తే.. పార్ల‌మెంటు ప్రాంగ‌ణం వ‌ద్ద‌ ఈ ఇద్ద‌రు నేత‌లు ఒకే కారులో నుంచి కిందికి దిగారు. ఈ సీన్ చూసిన పాత్రికేయుల‌కు.. మ‌తి పోయింది. వెంట‌నే “అదేంటి నిన్న మొన్న‌టి వ‌ర‌కు తిట్టుకున్నారు. ఇప్పుడు.. క‌లిసి ఒకే కారులో పార్ల‌మెంటుకు వ‌చ్చారు? “ అని ఆశ్చ‌ర్యంతో కూడిన ప్ర‌శ్న‌ను సంధించారు. దీనికి వారు ఇద్ద‌రూ ముక్తకంఠంతో “పాలిటిక్స్ పాలిటిక్సే. మేం ఇద్ద‌రం ఒకే రాష్ట్రం.. ఒకే ప్రాంతానికి చెందిన వారం. పైగా తెలుగు వాళ్లం. అది వేరు.. మా మ‌ధ్య స్నేహం వేరు“ అని స‌మాధానం ఇచ్చారు.

ఇప్పుడు ఈ విష‌యాన్ని ఎందుకు గుర్తు చేయాల్సి వ‌చ్చిందంటే.. ఈ ఘ‌ట‌న జ‌రిగిన ఏపీలోనే ఇప్పుడు రాజ‌కీయాలు అంటే.. క‌త్తులు నూరుకోవ‌డం.. క‌సి పెంచుకోవ‌డం.. అనే రెండు ప‌ట్టాల‌పైనే ప్ర‌యాణం చేస్తున్నాయి. ప్ర‌త్య‌ర్థి పార్టీ నాయ‌కుల‌ను శ‌తృవులుగా చూస్తున్న విధానం మ‌రింత‌గా పెరుగుతోంది. ఇది పై స్థాయి నుంచి కింది స్తాయి వ‌ర‌కు విస్త‌రిస్తుండ‌డం.. రాష్ట్రానికి, రాజ‌కీయాల‌కు కూడా మంచిది కాద‌ని అంటున్నారు ప‌రిశీలకులు. రాజ‌కీయంగా విభేదించ‌డం త‌ప్పుకాక‌పోయినా.. ప్ర‌తి విష‌యంలోనూ రాజ‌కీయం చూడ‌డ‌మే ఇప్పుడు విచార‌క‌రంగా మారింది.

అధికార వైసీపీ.. ప్ర‌తిప‌క్ష టీడీపీల మ‌ధ్య ఎక్క‌డా.. వెంట్రుక వాసి మాత్రం.. కూడా.. సానుకూల దృక్ఫ‌థం క‌నిపించ‌డం లేదనే వాద‌న వినిపిస్తోంది. తాజాగా స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని గ‌వ‌ర్న‌ర్ హ‌రిచంద‌న్ `ఎట్ హోం` నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యమంత్రి జ‌గ‌న్‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా చంద్ర‌బాబు హాజ‌ర‌య్యారు. అసెంబ్లీ స‌మావేశాల త‌ర్వాత‌.. అధికార‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు క‌నిపించిన ఏకైక వేదిక ఇదే. అయితే.. ఇది రాజ‌కీయ స‌భోస‌మావేశ‌మో.. కాదు. నేత‌ల గౌర‌వార్థం సాక్షాత్తూ.. గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన విందు.

అలాంటి కార్య‌క్ర‌మం లోనూ సీఎం జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న చంద్ర‌బాబు ప‌ట్ల గౌరవం చూపించ లేక పోయార‌నే వాద‌న వినిపిస్తోంది. అదేస‌మ‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు అయినా.. కొంత చొర‌వ చూపించి ఉండాల్సింద‌నే వ్యాఖ్య‌లూ వినిపిస్తున్నాయి. కానీ, రెండు పార్టీల అధినేత‌లు.. బింకంగా.. ఎవ‌రికివారే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. ఫ‌లితంగా.. క్షేత్ర‌స్థాయిలో ఈ రెండు పార్టీల మ‌ధ్య నాయ‌కుల వివాదాలు మ‌రింత ర‌చ్చ‌కెక్క‌డం.. ఎన్నిక‌ల నాటికి.. క‌త్తులు దూసుకోవ‌డం మ‌రింత పెరుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.. రాజ‌కీయాల్లో ఎత్తులు.. పైఎత్తులు ఉండాలే కానీ.. క‌సి.. క‌క్ష‌.. క‌త్తులు నూరు కోవ‌డంవంటి వాటి వ‌ల్ల ప్ర‌యోజనం ఏంట‌నేది.. ఇప్పుడు జ‌రుగుతున్న చ‌ర్చ‌.