కేసీఆర్‌కు మ‌రో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి?

తెలంగాణ‌లో ప‌ట్టు సాధించాల‌ని బీజేపీ చేస్తున్న ప్ర‌య‌త్నాలకు.. అధికార పార్టీ టీఆర్ఎస్ వేస్తున్న అడుగులు.. క‌లిసివ‌చ్చేలా చేస్తున్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికే.. చాలా మంది టీఆర్ఎస్ నాయకులు ప‌క్క చూపులు చూస్తున్నారు. కొంద‌రు.. కాంగ్రెస్‌లోకి జంప్ చేశారు. ఇంకా.. మ‌రికొంద‌రు రెడీ అవు తున్నారు. ఇక‌, బీజేపీలోకి చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే.. కాంగ్రెస్‌లోకి చిన్నా చిత‌కా నాయ‌కులు చేరుతుంటే.. బీజేపీలోకి పెద్ద నేత‌లు జంప్ చేస్తున్నారు..

ఈ ప‌రిణామం.. టీఆర్ ఎస్‌కు ఇబ్బందిగానే మార‌నుంద‌ని అంటున్నారు. గ‌తంలో మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌, ర‌ఘునంద‌న‌రావు, ఇప్పుడు.. కాంగ్రెస్ నేత‌ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి వంటి కీల‌క‌మైన నాయ‌కులు.. ఆర్థికంగా బ‌లంగా ఉన్న నేత‌లు బీజేపీ పంచ‌న చేరిపోయారు. వీరిలో ఇప్ప‌టికే జ‌రిగిన ఉప పోరులో ఇద్ద‌రు.. ఈట‌ల‌, ర‌ఘునంద‌న‌రావులు విజ‌యం ద‌క్కించుకుని.. బీజేపీకి ద‌న్నుగా ఉన్నారు. ఇక ఇప్పుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి వ‌ర‌కు విష‌యం వ‌చ్చింది.

అధికార పార్టీ టీఆర్ ఎస్ నుంచి జంపింగుల ప‌ర్వం ఇప్ప‌ట్లో ఆగేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు, నేత‌లు.. కాంగ్రెస్‌లోకి జంప్ చేశారు. మిగిలిన వారిలోనూ చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి వారిలో మాజీ మంత్రి కీల‌క‌మైన క‌మ్మ సామాజిక వర్గం నాయ‌కుడు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు.. కూడా బీజేపీ వైపు చూస్తున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో పాలేరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఓట‌మిని చ‌వి చూసిన‌.. తుమ్మ‌ల‌కు.. పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్ దగ్గ‌ర ఇమేజ్ త‌గ్గిపోయింది.

అంతేకాదు.. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యంద‌క్కించుకున్న కాంగ్రెస్ నాయ‌కుడు.. ఉపేంద‌ర్‌రెడ్డి.. త‌ర్వాత కాలంలో కారెక్కారు. ఇక‌, ఆయ‌న అటు సీఎం కేసీఆర్‌ను, ఇటు పార్టీ కీల‌క నాయ‌కుడు కేటీఆర్‌ను కూడా మురిపిస్తున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పాలేరు టికెట్ ఈయ‌నకే ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న తుమ్మ‌ల‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు ఎవ‌రు టికెట్ ఇస్తే.. వారికే మ‌ద్దతు తెల‌పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

అంటే.. ప్ర‌స్తుతం ఆయ‌న టీఆర్ఎస్ నాయ‌కుడిగా ఉన్న‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్కే ఛాన్స్ లేదని గ్ర‌హించిన నేప‌థ్యంలో ఆయ‌న కాంగ్రెస్ వైపు చూశార‌ని.. ఇటీవ‌ల చ‌ర్చ సాగింది. అయితే.. కాంగ్రెస్‌లో ఇంటి పోరు ఎక్కువ‌గా ఉండ‌డంతో ఆయ‌న దృష్టి బీజేపీపై ప‌డింద‌ని అంటున్నారు. బీజేపీ ఎలానూ.. ఇక్క‌డ పాగా వేయాల‌ని కోరుకుంటున్న‌నేప‌థ్యంంలో తుమ్మ‌ల వంటి నేత వ‌స్తే.. కాద‌నే ప్ర‌స‌క్తే ఉండ‌దు. సో.. ఎటొచ్చీ ముహూర్త‌మే త‌రువాయి అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారింద‌ని చెబుతున్నారు.

ఇటీవ‌ల తుమ్మ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే పిడుగు లాంటి వార్త వింటార‌ని.. అద్భుతం జ‌రుగుతుంద‌ని అన్నారు. వాస్త‌వానికి ముందస్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌నే ఊహాగానంతోనే ఆయ‌న ఇలా వ్యాఖ్యానించి ఉంటార‌ని.. అంద‌రూ అనుకున్నారు. కానీ, అలా కాకుండా.. ఆయ‌న బీజేపీలో కి చేర‌డ‌మే.. త‌రువాయి.. అనే విష‌యాన్ని ప‌రోక్షంగా ఇలా చెప్పుకొచ్చి ఉంటార‌ని.. ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. రాజ‌కీయాల్లో ఎవ‌రూ.. శాశ్వ‌త శ‌తృవులు కారు.. శాశ్వ‌త మిత్రులు కూడా కారు కాబ‌ట్టి.. ఏదైనా జ‌ర‌గొచ్చ‌ని అంటున్నారు.