యాత్రపై జనసేనాని కీలక ప్రకటన

ఇప్పటికే ఏపీ రాజకీయం హాట్ హాట్ గా ఉండటం తెలిసిందే. తెల్లారింది మొదలు ఏదో రచ్చ ఏపీ అధికారపక్షానికి సరిపోతుంది. దీనికి తోడు.. పాలన మీద కంటే పంచాయితీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే జగన్ సర్కారు పుణ్యమా అని.. ఏదో ఒక వివాదం.. మరేదో ఒక ఇష్యూతోనే సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఏపీ రాజకీయాల్ని మరింత వేడెక్కించేలా జనసేనాని పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. అక్టోబరు 5 నుంచి ఏపీ వ్యాప్తంగా ఆయన యాత్ర చేయనున్నట్లుగా ప్రకటించారు.

పవన్ కల్యాణ్ ఏపీ యాత్ర మొదలు పెట్టారంటే.. నిత్యం ఏదో ఒక స్టేట్ మెంట్ తో పాటు.. జగన్ సర్కారు తీరును కడిగిపారేయటం ఖాయం. పవన్ ఫైర్ అయిన వేళ.. అధికారపక్ష నేతలు అందుకు బదులుగా కౌంటర్ ఇవ్వటం ఖాయం. మొత్తంగా రాజకీయం వేడెక్కిపోవటం పక్కా అని చెప్పక తప్పదు. తన యాత్రకు సంబంధించిన కీలక ప్రకటన చేసిన పవన్ కల్యాణ్.. జగన్ సర్కారుపై ఘాటు విమర్శల్ని ఎక్కు పెట్టారు.

వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో అభివృద్ధిని మరచిందని.. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసి యువత భవిష్యత్తును నాశనం చేసిందన్నారు. జనసేన పార్టీ సరికొత్త ఐటీ పాలసీతో ముందుకు వస్తుందని.. అది రాష్ట్ర అభివృద్ధికి.. ఐటీ రంగ విస్తరణకు సాయం చేస్తుందన్నారు. తాజాగా మంగళగిరిలోని జనసేన ఐటీ విభాగం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు.

పార్టీ బలోపేతం కోసం పని చేసే విభాగాల్లో ఐటీ విభాగం చాలా కీలకమన్న ఆయన.. పవన్ కల్యాణ్ నాయకత్వంలో రాష్ట్రానికి  పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. పారిశ్రామికవేత్తల్ని  ఆకర్షించేలా జనసేన ఐటీ పాలసీ ఉండనున్నట్లుగా చెప్పి ఆసక్తిని రేకెత్తించారని చెప్పాలి. అక్టోబరు 5 నుంచి జనసేనాని రాష్ట్రవ్యాప్త యాత్రను మొదలు పెడతారన్న ఆయన.. ఎక్కడి నుంచి మొదలవుతుంది? రూట్ మ్యాప్ ఏమిటి? అన్న వివరాల్ని వెల్లడించాల్సి ఉంది.