అడుసు తొక్కనేల కాలు కడగనేల

స్టేజ్ ఎక్కగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది కొందరికి. మైక్ పట్టుకుని ఏదేదో మాట్లాడేస్తారు. ఇది సోషల్ మీడియా కాలం కావడంతో ఆ మాటలు వైరల్ అవడానికి, వివాదం రాజుకోవడానికి ఎంతో సమయం పట్టదు. తమ మాటల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసేలోపు చాలా డ్యామేజీ జరిగిపోతుంది. తర్వాత సారీలు చెప్పినా, ఎంత వివరణ ఇచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇటీవల టాలీవుడ్ సెలబ్రెటీలకు ఇలా నోరు జారి, క్షమాపణ చెప్పడం మామూలైపోయింది.

ఒక వేడుకలో మహిళల వస్త్రధారణ గురించి సూచన చేయబోయి శివాజీ మాట్లాడిన మాటలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. కెరీర్లో ఎన్నడూ లేనంతగా ఆయన ఇబ్బందిని ఎదుర్కొన్నారు. శివాజీ లేక లేక ఒక్కసారి తప్పు మాట్లాడారు. ఆ ప్రభావం ఇప్పటికీ ఆయన మీద కొనసాగుతోంది. కానీ లెజెండరీ స్టేటస్ ఉన్న రాజేంద్ర ప్రసాద్.. పదే పదే ఇలా అదుపు తప్పి మాట్లాడ్డం, తర్వాత సారీ చెప్పడం పరిపాటిగా మారిపోయింది.

80, 90 దశకాల్లో అద్భుతమైన కామెడీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన నటుడు రాజేంద్ర ప్రసాద్. అదే సమయంలో కొన్ని ఎమోషనల్ రోల్స్‌తోనూ ఆయన కట్టిపడేశారు. మాస్ హీరో కాకపోయినా.. ప్రతి ఇంట్లోనూ అభిమానులను సంపాదించుకుని లెజెండరీ స్టేటస్ తెచ్చుకున్న నటుడాయన. అలాంటి వ్యక్తికి ఈ మధ్య ఏమైందో అర్థం కావట్లేదు..

పదే పదే నోరు జారుతున్నారు. డేవిడ్ వార్నర్‌ లాంటి లెజెండరీ క్రికెటర్‌ను పట్టుకుని వాడు, వీడు, దొంగనాకొడుకు లాంటి మాటలు అన్నారు. సరదాకు అయినా సరే.. స్టేజ్ మీద ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు?
ఆలీతో ఎంత సాన్నిహిత్యం అయినా ఉండొచ్చు.. సభా మర్యాద పాటించకుండా తీవ్ర అసభ్య పదం అనేయడమేంటి? అదే స్టేజ్ మీద సీనియర్ నటి రవళిని పట్టుకుని డ్రమ్ములా ఉందంటూ బాడీ షేమింగ్ చేశారు.

ఇలా రాజేంద్ర ప్రసాద్ చుట్టూ ఇప్పటికే చాలా వివాదాలున్నాయి. ఇటీవల ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటిస్తే.. ఆయన నట వైభవం గురించి మరిచిపోయి, స్టేజ్ మీద ఇలాంటి భాష మాట్లాడే వ్యక్తికి ఈ పురస్కారం ఏంటి అని చాలామంది ప్రశ్నించిన పరిస్థితి. ఈ అవార్డు ప్రకటించాక కూడా ఆయన మారలేదు.

తాజాగా తనకు కాంతారావు అవార్డును అందజేస్తున్న సందర్భంగా ఆ నటుడిని కొనియాడే క్రమంలో ఎంజీఆర్‌ను కించపరిచేలా మాట్లాడి.. తమిళుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. తర్వాత ఎప్పట్లాగే క్షమాపణ వీడియో రిలీజ్ చేశారు. వార్నర్ గొడవ టైంలో కూడా ఆయన ఇలా వీడియో వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

కాంతారావు అవార్డు ఈవెంట్‌కు హాజరైనపుడు ఒక అభిమాని సెల్ఫీ అడిగితే రాజేంద్ర ప్రసాద్ చిరాకు పడి పక్కకు నెట్టిన వైనం కూడా విమర్శలకు దారి తీసింది. ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి మాటలతో తనకున్న గొప్ప పేరును రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికే చాలా దెబ్బ తీసుకున్నారు. ఇకనైనా ఆయనలో మార్పు రావాల్సిన అవసరం కనిపిస్తోంది. తనను తాను నియంత్రించుకోలేని స్థితిలో ఉంటే.. అసలు సినిమా ఈవెంట్లకే దూరంగా ఉంటే మరీ మంచిదేమో.