హాట్ టాపిక్: లోకేష్ చెప్తే అయిపోవాలంతే!

మంత్రి లోకేష్ చెప్పిన మాట‌ల‌ను ఎమ్మెల్యేలు తు.చ. త‌ప్ప‌కుండా చేస్తున్నార‌న‌డానికి శ‌నివారం రాష్ట్రంలో జ‌రిగిన కొన్ని ప‌రిణామాలే ఉదాహ‌ర‌ణ‌. వాస్త‌వానికి గ‌తంలోనూ నారా లోకేష్ చెప్పిన అనేక విష‌యాల్లో కొంద‌రు ఎమ్మెల్యేలు ముందుండి ప‌నిచేశారు. తాజాగా ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌లో మ‌ధ్యాహ్న భోజ‌నంపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అన్నం స‌రిగా ఉడ‌క‌క‌పోవ‌డంతోపాటు కొంద‌రి ప‌ళ్లాల్లో పురుగులు కూడా క‌నిపించ‌డం తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. దీంతో విద్యార్థులు త‌మ ప‌ళ్లాల్లోని అన్నాన్ని డ‌స్టు బిన్‌ల‌లో వేసేశారు.

ఈ ఘ‌ట‌న‌పై తీవ్రంగా క‌ల‌త చెందిన మంత్రి లోకేష్‌.. పాఠ‌శాల‌ల్లో అందిస్తున్న మ‌ధ్యాహ్న భోజ‌నం నాణ్య‌త‌ను మ‌రింత మెరుగు ప‌ర‌చాల‌ని ఆదేశించారు. అంతేకాదు.. ఎమ్మెల్యేలు ఖ‌చ్చితంగా నియోజ‌క‌వ‌ర్గాల్లోని పాఠ‌శాల‌ల‌ను ప‌రిశీలించి.. మ‌ధ్యాహ్న భోజ‌నాన్ని రుచి చూడాల‌ని కూడా ఆదేశించారు. దీంతో శ‌నివారం హుటాహుటిన రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు త‌మ త‌మ ప‌రిధిలోని పాఠ‌శాల‌ల‌ను ప‌రిశీలించారు. మ‌ధ్యాహ్న భోజ‌నాన్ని రుచి చూశారు. శ్రీకాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కు చాలా చోట్ల ఈ త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపించింది.

నెల్లూరులో కోవూరు ఎమ్మెల్యే ప్ర‌శాంతి రెడ్డి ప‌లు చోట్ల పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించి.. మ‌ధ్యాహ్న భోజ‌నం రుచి చూశారు. కొన్ని మార్పులు సూచించారు. అదేవిధంగా ఆత్మ‌కూరులో మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి అనుచ‌రులు పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించి భోజ‌నం టేస్టు చేశారు. అలాగే ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ కూడా ప‌లు పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించి భోజనం రుచి చూశారు. మార్పులు సూచించారు. ఇదిలావుంటే.. మంత్రి నారా లోకేష్ చెప్ప‌గానే ఎమ్మెల్యేలు క‌ద‌ల‌డం.. పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించ‌డం వంటివి పార్టీలో ఆస‌క్తిగా మారింది.

ఇప్పుడే కాదు.. గ‌తంలో ప్ర‌జాద‌ర్బార్ల నిర్వ‌హ‌ణ విష‌యంపై కూడా నారా లోకేష్ ఇచ్చిన పిలుపును అందుకున్నారు. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జాద‌ర్బార్‌లు నిర్వ‌హించారు. స‌మ‌స్య‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇప్ప‌టికీ.. వాటిని కొన‌సాగిస్తున్నారు. కొంద‌రు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌లు అందిస్తున్న‌వారు కూడా ప‌లువురు ఉన్నారు. మొత్తంగా చంద్ర‌బాబు త‌ర్వాత‌.. నారా లోకేష్ మాట‌కు ఎమ్మెల్యేల‌కు ప్రాధాన్యం ఇవ్వడం.. ఆయ‌న బాట‌లో న‌డిచేందుకు ఉత్సాహం చూప‌డం వంటివి పార్టీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీస్తోంది.