అక్క‌డ‌ `జ‌న‌సేన‌` ఉడుంప‌ట్టు

గిరిజ‌న ప్రాబ‌ల్యం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌పై జ‌న‌సేన ఉక్కుపిడికిలి బిగిస్తోంది. ఇటీవ‌ల కాలంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. కార్య‌క్ర‌మాల జోరు పెంచ‌డంతోపాటు.. వ్య‌క్తిగ‌తంగా కూడా వారికి చేరువ అయ్యే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని కూడా.. తండాల‌లో నిర్వ‌హించ‌డం ద్వారా గిరిజ‌నుల మ‌నసు దోచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వాస్త‌వానికి తొలుత పిఠాపురంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేయాల‌ని భావించారు.

కానీ, అనూహ్యంగా పాడేరు వంటి గిరిజ‌న ప్రాంతాల‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని మ‌ళ్లించారు. తాను కూడా స్వయంగా హాజ‌ర‌య్యారు. ఈ వ్యూహాన్ని త‌క్కువ‌గా అంచ‌నా వేసేందుకు అవ‌కాశం లేదు. బ‌ల‌మైన వైసీపీ ఓటు బ్యాంకును త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలోనే ప‌వ‌న్ ఈ దిశ‌గా అడుగులు వేస్తున్నార‌న్న చ‌ర్చ కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు.. త‌ర్వాత వైసీపీకి అనుకూలంగా ఎస్టీ సామాజిక వ‌ర్గాలు బ‌లంగా నిలిచాయి.

దీంతో టీడీపీ సైతం.. ఆయా నియోజ‌క‌వర్గాల్లో తుడిచిపెట్టుకుపోయింది. వైసీపీ నాయ‌కులు ఎవ‌రైనా స‌రే.. విజ‌యం ద‌క్కించుకునే స్థాయికి గిరిజ‌న ప్రాబ‌ల్య నియోజ‌క‌వ‌ర్గాలు చేరాయి. ఒక్క ఈ నియోజ‌క‌వ‌ర్గాలే కాదు.. గిరిజ‌నులు ఎక్కువ‌గా ఉన్న జ‌న‌ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ పేరు మార్మోగింది. ఇప్పుడు దానిని త‌న‌దైన శైలిలో త‌న‌వైపు మ‌ళ్లించుకునేందుకు జ‌న‌సేన వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నద‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తూనే ఉంది.

తండాల్లో ర‌హ‌దారుల నిర్మాణం నుంచి వ్య‌క్తిగ‌తంగా ఆయా కుటుంబాల‌కు సాయం వ‌ర‌కు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. తాజాగా పార్టీ ఆవిర్భావ స‌మావేశం నిర్వ‌హించ‌డం ద్వారా మ‌రింత‌గా వారిని త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా వైసీపీకిమైన‌స్ అయ్యే అవ‌కాశం ఉంది. అయితే.. ఏడు నియోజ‌క‌వ‌ర్గాలే ఎస్టీల‌కు ఉన్నాయి కాబ‌ట్టి.. త‌మ‌కు ఇబ్బంది లేద‌ని వైసీపీ భావిస్తే.. అది పూర్తిగా త‌ప్పులో కాలేసిన‌ట్టే అవుతుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. గిరిజనులు అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్నారు. వారి ఓటు ప్ర‌భావితం కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.