వైసీపీ అధినేత జగన్కు జనసేన పార్టీముఖ్య నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. కీలక సూచనలు చేశారు. అయితే.. జగన్ ఎవరి మాటా వినరు.. అనే పేరుబడ్డ నేపథ్యంలో ఇప్పుడు నాగబాబు చెప్పింది మాత్రం ఆయన తలకెక్కించుకుంటారా? అనేది చూడాలి. అయితే..నిత్యం రాజకీయ విమర్శలు-ప్రతివిమర్శలు చేసుకునే వైసీపీ-జనసేనల మధ్య ఈ సూచనలు, సలహాల రాజకీయం తెరమీదికి రావడం కూడా ఆసక్తిగా మారింది. ఏదేమైనా నాగబాబు చేసిన సూచనలు బాగానే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.
తాజాగా జనసేన పార్టీ 13వ వార్షికోత్సవం జరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ వేడుకలు నిర్వహించారు. శ్రీకాకుళంలో జరిగిన వేడుకల్లో నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి సంబంధించిన అంశాలతోపాటు వైసీపీకి కూడా కొన్ని సూచనలు చేశారు. ప్రస్తుతం రప్పా-రప్పా డైలాగులు చేస్తున్నారని.. ఇవి సరికావని అన్నారు. “మొన్న నేను ప్రజల మధ్య ఉన్నప్పుడు.. ఈ మాటే చెప్పారు. రప్పా-రప్పా పార్టీ ఏంటి? అని అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆ పార్టీకి మంచిదికాదు.“ అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. మళ్లీ అధికారం మాదేనని చెబుతున్న వైసీపీకి రప్పా-రప్పా.. నరుకుతాం అనే డైలాగులు మేలు చేయవని అన్నారు. వీటిపై ఆ పార్టీనాయకులు ఆలోచన చేసుకోవాలని సూచించారు. కానీ, చెబితే వినే టైపు కాదు! అని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పరిస్థితి ఇలానే కొనసాగితే.. వైసీపీకి 11 సీట్లు కూడా రావని.. ఈవిషయాన్ని చాలా మంది నాయకులు తనతో చెబుతున్నారని అన్నారు. వైసీపీలో తనకు మిత్రులు కూడా ఉన్నారని తొలిసారి నాగబాబు చెప్పారు. అయితే.. వారు కూడా రప్పా-రప్పా డైలాగులను తప్పుబడుతున్నారని తెలిపారు.
కూటమి గురించి..
రాష్ట్రంలో కూటమి అవసరం ఎంతో ఉందని నాగబాబు చెప్పారు. అనేక అవమానాలు భరించిన తర్వాతే.. పొత్తు పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కూటమిలో ఉండకపోతే.. ఇబ్బందులు తప్పవన్న ఆయన.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య పొరపొచ్చాలు సహజమేనని.. అయినా కలసి కూర్చుని చర్చించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. పైస్థాయిలో మాత్రం పార్టీలు కలివిడిగానే ముందుకు సాగుతాయని ఆయన తేల్చి చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
