డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీకి పాజిటివ్

బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కూడా పాల్గొన్న వైనం షాకింగ్ గా మారింది.

అయితే, ఎంపీ పుట్టా మహేష్‌కు యూరిన్ టెస్ట్ లో నెగటివ్ వచ్చినట్లు నిన్న ఈగల్‌ టీమ్ పోలీసులు వెల్లడించారు. కానీ, తాజాగా నేడు మరోసారి నిర్వహించిన బ్లడ్ టెస్టులో పుట్టా మహేష్ కు పాజిటివ్ వచ్చిందని ఈగల్ టీం ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. శరీరంలో మెటబాలిజమ్ లో జరిగే మార్పుల వల్ల ఇలా రెండు రోజుల్లో రెండు వేర్వేరు ఫలితాలు వచ్చాయని ఆయన తెలిపారు.

మొయినాబాద్ లో పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని నార్కోటిక్ అధికారులకు సమాచారం అందడంతో వారు అక్కడ దాడులు నిర్వహించారు. పైలట్ రోహిత్ రెడ్డి, పుట్టా మహేష్ తో పాటు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే నేడు ప్రెస్ మీట్ లో ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ కీలక విషయాలు వెల్లడించారు. రోహిత్‌రెడ్డి, పుట్టా మహేష్ సహా ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా డ్రగ్స్‌ తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. బెంగుళూరుకు చెందిన కౌశిక్‌ రవి అనే వ్యక్తి సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు నిర్ధారించారు.

అయితే, ఈ రైడ్ సందర్భంగా పోలీసులపై కాల్పులు జరిపిన వైనం షాకింగ్ గా మారింది. ఆ పార్టీలో ఉన్న ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ మిశ్రా గాలిలోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ గన్ లైసెన్స్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి పేరు మీద ఉందని తెలుస్తోంది.

పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ఆయుధ చట్టాన్ని ఉల్లంఘించడం వంటి సెక్షన్లతో ఈ కేసు రోహిత్ రెడ్డిని మరింత ఇరుకున పడేసింది. అంతేకాదు, రైడ్ సమయంలో రోహిత్ రెడ్డి పీఏ తన ఫోన్‌ను పగలగొట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. డ్రగ్ పెడ్లర్ల నంబర్లు, చాట్ హిస్టరీ ఆ ఫోన్లో ఉండడంతోనే పగలగొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఫోన్ డేటాను రికవరీ చేయడానికి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించనున్నారు.

ఇటు పుట్టాకు పాజిటివ్ తేలడంతో ఏపీ రాజకీయాలు ఒకసారిగా షేక్ అయ్యాయి. ఇటువంటి సమయంలో ఎప్పటిలానే ఈసారి కూడా చంద్రబాబు కఠినంగా వ్యవహరించాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.