వచ్చే ఎన్నికల్లో తేజస్వీయే ఛాంపియనా ?

బీహార్లో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఎన్డీయేకి దెబ్బ తప్పేట్లు లేదు. ఇండియా టు డే-సీ ఓటర్ ఇదే అంశంపై రాష్ట్రంలో సర్వే చేసిందట. దాని ఫలితాలను బుధవారం విడుదల చేసింది. తాజా సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు లోక్ సభకు ఎన్నికలు జరిగితే మొత్తం 40 స్ధానాల్లో మహాఘట్ బంధన్ 26 స్ధానాల్లో గెలుస్తుందని ఇండియు టు డే స్నాప్ పోల్ తేల్చింది. సర్వేలన్నీ నిజాలవుతాయని అనుకునేందుకు లేదు. కాకపోతె పబ్లిక్ పల్స్ ఎలాగుందనే విషయంలో కేస్ స్టడీగా తీసుకోవచ్చు

బీజేపీ సారధ్యంలోని ఎన్డీయేకి 14 సీట్లు మాత్రమే దక్కుతాయని చెప్పింది. 2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 39 సీట్లు వస్తే మహాఘట్ బంధన్ కు కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కింది. ఇదే సమయంలో ఎన్డీయే ఓటింగ్ శాతం 54 నుండి 41కి తగ్గిపోతుందని సర్వేలో తేలింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రజాధరణ కోల్పోతున్నట్లు బయటపడింది.

నితీష్ కాకపోతే తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే విషయమై జరిగిన సర్వేలో ఎక్కువమంది ఆర్జేడీ అధినేత తేజస్వీయాదవ్ వైపే మొగ్గు చూపడం గమనార్హం.  43 శాతం మంది తేజస్వీని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నితీష్ కుమార్-తేజస్విల్లో ఎవరిని ముఖ్యమంత్రులుగా ఎంచుకుంటారన్న ప్రశ్నకు నితీష్ వైపు 24 శాతం మందే మొగ్గుచూపారు. 19 శాతం మంది బీజేపీ నేత సీఎం అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

అంటే ఇండియా టు డే స్నాప్ పోల్ సర్వేని జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. అదేమిటంటే బీహార్ కు వచ్చే ఎన్నికల్లో కావచ్చు లేదా తర్వాతైనా కావచ్చు తేజస్వీ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని. తేజస్వికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. మిగిలిన జనాల్లో కూడా తేజస్వికి మద్దతు పెరుగుతోందన్న విషయం అర్ధమవుతోంది. ఇపుడు డిప్యుటి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తేజస్వి మిగిలిన కాలాన్ని జాగ్రత్తగా నిర్వహిస్తే వచ్చే ఎన్నికల్లోనే హీరో అయినా ఆశ్చర్యం లేదు.