ఎంపీలను కూడా అరెస్టు చేయవచ్చు

మామూలు జనాలకు, ఎంపీలకు మధ్య తేడా ఏమీ లేదని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు స్పష్టంగా ప్రకటించారు. క్రిమినల్ కేసుల్లో ఎంపీలను కూడా విచారణకు అదుపులోకి తీసుకోవటంలో తప్పేమీ లేదన్నారు. కాంగ్రెస్ ఎంపి మల్లికార్జున ఖర్గేను ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులిచ్చి విచారణకు పిలిపించటాన్ని కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం పెట్టారు. ఇదే విషయమై ఉభయ సభల్లో పెద్ద గోలే చేశారు.

సభ ఒకసారి వాయిదా పడిన తర్వాత మళ్ళీ ప్రారంభమైన సందర్భంగా గోల మళ్ళీ మొదలైంది. ఇదే విషయమై వెంకయ్య సుదీర్ఘ వివరణిచ్చారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయన్న కారణంగా ఎంపీలను క్రిమినల్ కేసుల్లో అరెస్టులు చేయకూడదని నిబంధన ఎక్కడా లేదన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయని చెప్పి క్రిమినల్ కేసుల నుండి తప్పించుకునే విశేషాధికారాలు ఎంపీకి లేవని వెంకయ్య స్పష్టంగా ప్రకటించారు.

అరెస్టుల విషయంలో మామూలు జనాలతో  దర్యాప్తు అధికారులు ఎలా వ్యవహరిస్తారో ఎంపీలతో కూడా అలాగే వ్యవహరించచ్చని చెప్పారు. విచారణ కోరుతూ ఎంపీలకు దర్యాప్తు సంస్ధలు నోటీసులు ఇచ్చినపుడు కచ్చితంగా విచారణకు ఎంపీలు హాజరవ్వాల్సిందే అని తేల్చి చెప్పారు. విచారణ నుండి తప్పించుకునేందుకు ఎంపీలు పార్లమెంటు సమావేశాలను సాకుగా చూపించటం కుదరదన్నారు. తమను విచారించటం, దర్యాప్తు చేయటంలో మామూలు జనాలకు మించి తమకు పార్లమెంటు రక్షణగా ఉంటుందనే అపోహ చాలామంది ఎంపీల్లో ఉందన్నారు. అలాంటి అపోహల్లో ఎవరైనా ఎంపీలుంటే అవన్నీ ఉత్త భ్రమలన్న విషయం తెలుసుకోవాలని సూటిగా చెప్పారు.

అయితే పార్లమెంటు సమావేశాలు, కమిటీ సమావేశాలకు 40 రోజుల ముందు, 40 రోజుల తర్వాత అరెస్టు చేయకూడదని సివిల్ కేసుల్లో మాత్రమే నిబంధన ఉందన్నారు. అంటే సివిల్ కేసుల్లో ఉన్న నిబంధన క్రిమినల్ కేసులకు వర్తించదని వెంకయ్య స్పష్టంచేశారు. సివిల్ కేసులంటే ఆస్తి తగాదాలే ఉంటాయి కాబట్టి ఈరోజు కాకపోయినా రేపైనా విచారణ జరపచ్చు, అరెస్టు చేయచ్చని వెసులుబాటు కల్పించారేమో.