జ‌నాల‌కు ఉచితాలు వ‌ద్దు.. మ‌రి ఎంపీల మాటేంటి?

ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఉచిత హామీలు గుప్పించి.. పార్టీలు ల‌బ్ది పొందుతున్నాయ‌నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇలా చేయ‌డం వ‌ల్ల ఖ‌జానాకు న‌ష్టం వ‌చ్చి.. దేశం ఆర్థికంగా వెనుక బ‌డిపోతోంద‌ని.. ప్ర‌భుత్వాల‌ అప్పులు పెరిగిపోతు న్నాయ‌ని.. పెద్ద ఎత్తున కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఈ విష‌యం.. సుప్రీం కోర్టుకు చేరింది. దీనిపై సుప్రీం కోర్టు కూడా ఆస‌క్తిగానే స్పందించింది. ఉచితాలు అనుచితాలు.. అంటూ వ్యాఖ్య చేసింది. దీనిపై రాష్ట్రాలు.. కేంద్ర ప్ర‌భుత్వం కూడా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరింది.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు మ‌రో మౌలిక ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది.  ప్ర‌జ‌లకు.. ముఖ్యంగా పేద‌ల‌కు ఉచితాలు వ‌ద్దు.. స‌రే.. మ‌రి ఎంపీల‌కు.. పింఛ‌న్లు, ఇత‌ర అలవెన్సులు, రాయితీలు, ఎమ్మెల్యేల‌కు పింఛ‌న్లు, ప్ర‌యాణ భ‌త్యాలు.. ఇలా ఇవ్వ‌డం స‌మంజ‌స‌మేనా? ఇది ఖ‌జానాపై ప్ర‌భావం చూపించ‌దా? అనే ప్ర‌శ్న ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే.. అధికార పార్టీ స‌హా ఇత‌ర పార్టీల నాయ‌కులు మాత్రం దీనిపై మౌనం వ‌హిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌లకు ఉచిత హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపును రద్దు చేయాలంటూ బీజేపీ సభ్యుడు, అడ్వొకేట్ అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం కొన్నాళ్ల కింద‌టే విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిని సమర్థించారు. ఉచిత హామీలతో ఆర్థిక సంక్షోభం ఏర్పడొచ్చని ఆయన అన్నారు. మరోవైపు.. పార్లమెంటులో దీనిపై చర్చ జరగాలని కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించగా.. ఏ రాజకీయ పార్టీ అలా చేయలేదు.

కేంద్రం, విపక్షాలు, ముఖ్యమంత్రులు, నీతి ఆయోగ్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ వంటి సంస్థలు అన్నీ కలిసి సమస్యను పరిష్కరిస్తే బాగుంటుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అంతిమంగా ఒక నిర్ణ‌యం తీసుకుని.. దానిని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పిస్తే..దానిని అమలు చేయాల్సింది మళ్లీ ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వమేనని సుప్రీంకోర్టు గ‌తంలోనే స్పష్టం చేసింది. అందుకే అన్ని పక్షాలు చర్చించుకొని.. సూచనలు అందించాలని ఆదేశించింది.

మ‌రో వివాదం.. ఇలా..

ప్రజలకు ఉచితాల గురించి ప్రశ్నించే ముందు.. పార్లమెంటు సభ్యుల పింఛన్లు, ప్రోత్సాహకాల గురించి చర్చ ఎందుకు జరపట్లేదని  బీజేపీ కే చెందిన మ‌రో ఎంపీ వరుణ్ గాంధీ దుయ్య‌బ‌ట్టారు. ఎన్నికల్లో ఉచితాలపై చర్చ జరగాలని.. బీజేపీ సభ్యుడు సుశీల్ మోదీ రాజ్యసభలో డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇలా ట్వీట్ చేశారు వరుణ్. ఎన్నికల ప్రచారంలో ఉచిత హామీలపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే.. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ నాయకుడు ఒకరు కీలక ప్రకటన చేశారు. ‘రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. 18-60 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ. 1500 చొప్పున అందిస్తాం’ అని హామీ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో అస‌లు ఉచితాల‌పై ర‌గ‌డ కావాల‌నే చేస్తున్నారా?  లేక‌.. రాజ‌కీయ వ్యూహ‌మా? అనేది ఆస‌క్తిగా మారింది.