రాష్ట్రంలో ఏ క్ష‌ణ‌మైనా ఉప ఎన్నిక‌లు

తెలంగాణ రాష్ట్రంలో ఓవైపు మునుగోడు ఉపఎన్నిక.. మరోవైపు ముందస్తు ఎన్నికల గురించి ఆసక్తికర చర్చ నడుస్తోన్న నేపథ్యంలో.. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటించిన మాజీమంత్రి తుమ్మల.. ముందస్తు ఎన్నికల గురించి కార్యకర్తలకు చూచాయగా సిగ్నల్స్ ఇచ్చారు. కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని.. ఏ క్షణమైనా పిడుగు లాంటి వార్త వినొచ్చని తుమ్మల వ్యాఖ్యానించారు.

గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగానన్న తుమ్మల.. ఈసారి మాత్రం పాలేరుపైనే దృష్టిపెట్టినట్టు స్పష్టం చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధిపైనే దృష్టి పెట్టాన్నారు. ఇప్పుడు కూడా ఆశీర్వదిస్తే మిగిలిన పనులన్ని పూర్తి చేస్తానన్నారు. గతంలో దొర్లిన తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలని కార్యకర్తలకు తుమ్మల సూచించారు. తాను ఇక నుంచి ప్ర‌జ‌లు, కార్య‌క‌ర్త‌ల మ‌ధ్యే ఉంటాన‌ని.. ఆయ‌న చెప్పారు. ప్ర‌తి స‌మ‌స్య‌ను త‌న దృష్టికి తీసుకురావాల‌ని అన్నారు.

“సిద్ధం కండి.. ఏ క్షణమైనా పిడుగు లాంటి వార్త వినొచ్చు. గతంలో తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోండి. మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధిపైనే దృష్టి పెట్టా. కార్యకర్తలను పూర్తిస్థాయిలో కలవలేకపోయా. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగా. ఇప్పుడు మాత్రం పాలేరుపైనే దృష్టిపెట్టా“ అని తుమ్మ‌ల వ్యాఖ్యానించారు.

అయితే.. వాస్త‌వానికి.. పాలేరు నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న ఉపేంద‌ర్‌రెడ్డి(కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం సాధించారు. త‌ర్వాత‌.. టీఆర్ ఎస్‌లో కి జంప్ చేశారు) ఉండ‌గా.. ఇప్పుడు తుమ్మ‌ల‌కు సీటు ఇస్తారా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. పైగా ఉపేంద‌ర్‌రెడ్డికి కేటీఆర్‌కు మ‌ధ్య ఇటీవ‌ల కాలంలో అవినాభావ సంబంధాలు మ‌రింత పెరిగాయి. మ‌రోవైపు.. తుమ్మ‌ల‌కు కేసీఆర్‌కు మ‌ధ్య దూరం పెరిగిపోయింది. ఈ క్ర‌మంలో తుమ్మ‌ల వ్యాఖ్య‌లు.. పాలేరు నియోజ‌క‌వ‌ర్గంపై ఆయ‌న దూకుడు.. ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.