మరీ ఇంత వైరాగ్యమా ? గుడ్ బై చెప్పేస్తారా ?

ఎవరికి కూడా వైరాగ్యం అంత తొందరగా రాదు. అందులోను రాజకీయాల్లో దశాబ్దాలుగా పదవుల్లో ఉంటున్నవారికి అసలు రాదు. దీర్ఘకాలంపాటు ప్రతిపక్షంలోనే ఉన్నవారిలో కొందరు నేతలకు వైరాగ్యం వచ్చినా అదోలెక్క. ఎందుకంటే ఎంతకాలమున్నా ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సిందే అని ఫిక్సయిపోయిన కొందరికి వైరాగ్యం రావటంలో తప్పుకూడాలేదు. కానీ అధికారంలో ఉంటు మంత్రిగా పనిచేస్తున్న సీనియర్ నేతకు కూడా వైరాగ్యం వచ్చిందంటే ఏమిటర్ధం ?

ఇపుడిదంతా ఎవరి విషయంలో అంటారా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురించే. మహారాష్ట్రలోని ఒక కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ మాట్లాడుతు రాజకీయాలంటే కేవలం అధికారం కోసమే అన్నట్లుగా మారిపోయిందన్నారు. ఇలాంటి రాజకీయాలను చూసిన తర్వాత దూరంగా జరగాలని అనిపిస్తోందంటు గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు బీజేపీలో చర్చనీయాంశమైంది. రాజకీయాల్లో ఉండటం, పదవులు అనుభవించటం లేదా పదవుల కోసం ప్రయత్నాలు చేసుకోవటం కన్నా చేయాల్సిన పనులు వేరే ఉన్నాయని అనిపిస్తోందని కేంద్రమంత్రి చెప్పారు.

రాజకీయాలంటే సమాజం, దేశ సంక్షేమం కోసం చేసేవేనా ? లేకపోతే పదవుల కోసం చేసేవి మాత్రమేనా అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ప్రస్తుతం రాజకీయాలంటే పదవులు, అధికారం అందుకోవటం కోసమే అన్నట్లుగా తయారైందని గడ్కరీ తెగ బాధపడిపోయారు. అందుకనే పదవుల కోసం కాకుండా రాజకీయ నేతలు సేవా మార్గం గురించి కూడా ఆలోచించాలన్నారు. అంతా బాగానే ఉందికానీ సడెన్ గా గడ్కరీలో ఇంతటి వైరాగ్యం ఎందుకు వచ్చిందో అర్ధం కావటం లేదు.

కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన స్థానంలో ఉన్నారు. బీజేపీని కూడా శాసించగలిగిన ఆర్ఎస్ఎస్ లో కూడా గడ్కరీ ప్రముఖుడనే చెప్పాలి. నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయాన్ని చూడాల్సొస్తే ఎవరు అన్నపుడు గడ్కరీ పేరే ప్రముఖంగా వినిపించింది ఒక సమయంలో. మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేతల్లో ఈయన కూడా ముందు వరసలోనే ఉంటారు. ఇంతటి కీలకమైన స్థానంలో, కీలకమైన పాత్రను పోషిస్తున్న గడ్కరీకి ఉన్నట్టుండి రాజకీయాలంటే ఇంతటి వైరాగ్యం ఎందుకొచ్చిందో తెలీటం లేదు. తొందరలోనే రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారేమో చూడాలి.