మోడీ: తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు

రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి. అది కూడా.. ప్రాంతీయ పార్టీలు.. విప‌క్ష కాంగ్రెస్, క‌మ్యూనిస్టు పాలిత రాష్ట్రాలు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నాయి. ఇక‌, ఆయా రాష్ట్రాలు స‌ర్దుబాటు చేసుకోక‌పోతే.. అక్క‌డ ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌తారు.. ముఖ్య‌మంత్రుల‌ను త‌రిమి కొడతారు.. అంటూ.. కేంద్రం తాజాగా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఓకే.. ఈ హెచ్చరిక‌లు బాగానే ఉన్నాయి. అయితే.. అదే స‌మ‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు చేస్తున్న అప్పులు మాత్రం ఎందుకు చెప్ప‌లేదు? ఇదీ.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఇదే విష‌యాన్ని విప‌క్షాలు కడిగిపారేశాయి. కేంద్రంలో న‌రేంద్ర‌ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత(8 ఏళ్ల‌లో) కేంద్ర ప్రభుత్వం రూ.95 లక్షల కోట్లు అప్పు చేసింది. ఇది జీడీపీలో 42శాతంగా ఉంది. పైగా స్వ‌తంత్ర భార‌త దేశంలో ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసిన ప్ర‌భుత్వం కూడా లేదని.. ఆర్థిక నిపుణులు కొన్నాళ్ల కింద‌టే పెద‌వి విప్పారు. అయితే.. తాజాగా ఇచ్చిన అప్పులు లెక్క‌ల నుంచి కేంద్రాన్ని మిన‌హాయించారు. మరి ఇదే స‌మ‌యంలో కేంద్రం చేసిన అప్పులు కూడా వెల్ల‌డించి ఉంటే.., మోడీ నిబద్ధ‌త‌పై ఎక్క‌డా అనుమానం వ‌చ్చి ఉండేది కాదు.

కానీ, కేవ‌లం రాష్ట్రాల వైపు.. ఒక‌వేలు చూపించారు మోడీ. ఇదిలావుంటే.. అస‌లు రాష్ట్రాల‌ను ఎవ‌రి మానాన వారిని వ‌దిలేయడానికి .. మ‌న‌ది అమెరికా కాద‌నేది.. నిపుణుల మాట‌. అక్క‌డ సంయుక్త రాష్ట్రాలు ఉన్నాయి. అంటే.. అక్క‌డి రాష్ట్రాల‌కు ప్ర‌త్యేకంగా కొన్ని నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి. ఒక్క ర‌క్ష‌ణ త‌ప్ప‌.. మిగిలిన విష‌యాల్లో కేంద్రం జోక్యం(అధ్య‌క్ష భ‌వ‌నం) చేసుకునే అవ‌కాశం లేదు. కానీ, మ‌న దేశం అలా కాదు.. రిప‌బ్లిక్ దేశం. అంటే.. రాష్ట్రాల‌పై కేంద్రానికి బాధ్య‌త ఉంటుంది. ఆర్థిక విష‌యాల్లో అయితే.. మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది.

సో… ఇప్పుడు కేంద్రం చెబుతున్న‌ట్టు.. రాష్ట్రాలు అప్పులు చేసేందుకు.. అవ‌కాశం క‌ల్పించారంటే.. అది నిర్వివాదంగా.. కేంద్రం చేసిన త‌ప్పుగానే ప‌రిగ‌ణించాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. దీనిని విస్మ‌రించి.. రాష్ట్రాల‌పై నింద‌లు వేయ‌డం.. అప్పులుచేస్తున్నారంటూ.. ఎత్తి చూప‌డం ఎంత వ‌ర‌కు సమంజ‌సం. పోనీ.. అప్పులు చేస్తున్నార‌ని చెప్పిన కేంద్రం దీనికి విరుగుడుగా ఏదైనా దిశానిర్దేశం చేసిందా? అంటే.. లేదు. పెరుగుతున్న జ‌నాభాకు అనుగుణంగా.. రాష్ట్రాల్లో మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఇప్పుడు పెరిగింది. దీనికి ద‌న్నుగా కేంద్రం స‌హ‌క‌రించ‌క‌పోగా.. అప్పులు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. వెర‌సి.. కేంద్ర‌మే దోషి త‌ప్ప‌.. రాష్ట్రాలు ఎలా అవుతాయో.. మోడీ మ‌హాశ‌యులే సెల‌వివ్వాల‌ని.. అంటున్నారు పరిశీల‌కులు.