మళ్ళీ సెంటిమెంటు రగులుస్తున్నారా ?

ఎప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నా వెంటనే సెంటిమెంటు చిచ్చు మొదలవుతుంది. ఇపుడు భద్రాచలంపై మొదలైన వివాదం ఇందులో భాగమే. షెడ్యూల్ ఎన్నికలు మరో ఏడాదిన్నరలో వస్తున్నాయి. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా రావచ్చు. అధికార టీఆర్ఎస్ కానీ ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు ముందస్తుకు రెడీగానే ఉన్నట్లున్నాయి. సో జనాలు కూడా ముందస్తు ఎన్నికలు ఖాయమనే అనుకుంటున్నారు.

రాజకీయ వేడి బాగా పెరిగిపోతోంది కాబట్టి హఠాత్తుగా సెంటిమెంటు కూడా మొదలైపోయింది. ఎన్నికలు అనగానే టీఆర్ఎస్ కు ముందుగా వచ్చేది తెలంగాణా జనాలను సెంటిమెంటు పేరుతో రెచ్చగొట్టడమే. ఇపుడు ప్రత్యేకంగా రెచ్చగొట్టడానికి అంశాలేమీలేవు. అందుకనే అందివచ్చిన భారీవర్షాలు, వరదలను టేకప్ చేసింది. ఏపీలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం ముణిగిపోతుందని తెలంగాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం ఎంఎల్ఏలు గోల మొదలుపెట్టారు.

దీనికి అంతేస్ధాయిలో మంత్రులు బొత్సా సత్యనారాయణ, అంబటి రాంబాబుతో పాటు మాజీమంత్రి పేర్నినాని నుండి కౌంటర్లు మొదలయ్యాయి. వాతావరణం చూస్తుంటే ఇంకొద్ది రోజులు భద్రాచలం చుట్టూ వివాదం రగులుకునే అవకాశముంది. ఏపీకి ఇచ్చేసిన తెలంగాణాలోని ఏడు మండలాలను తిరిగి తెలంగాణాకు ఇచ్చేయాలని పువ్వాడ, ఎంఎల్ఏలు రచ్చ మొదలుపెట్టేశారు. దాంతో భద్రాచలంను ఏపీకిచ్చేయాలని ఏపీ నుండి డిమాండ్లు మొదలయ్యాయి. నిజానికి భద్రాచలాన్ని ఏపీకి ఇచ్చేయటం సాధ్యం కాదని, ఏపీలోని ఏడు మండలాలను తిరిగి తెలంగాణాకు ఇచ్చేయటం సాధ్యం కాదనీ తెలుసు.

రెండు వైపుల నుండి వస్తున్న డిమాండ్లలో ఏదీ సాధ్యంకాదని తెలిసి కావాలనే డిమాండ్లు మొదలుపెట్టారు. కాబట్టి ఇదే విషయమై తెలంగాణాలో పెద్ద రచ్చ జరుగుతుంది. జనాల్లో మళ్ళీ తెలంగాణా సెంటిమెంటును కావాలనే రగిల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జనాలు కూడా రెచ్చిపోతే ఈ వేడి ఎన్నికలవరకు కంటిన్యు అవుతుందా ? లేకపోతే మళ్ళీ ఎన్నికల సమయానికి ఇంకో సెంటిమెంటును రగులుస్తారా ? చూడాలి.