మూడు సింహాల‌పై తీవ్ర దుమారం

భార‌త జాతీయ చిహ్నం.. మూడు సింహాల‌పై ముప్పేట దుమారం రేగింది. దేశ‌వ్యాప్తంగా అన్ని బీజేపీయేత‌ర పార్టీలు.. తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. మోడీ నిర్వాకంతో భార‌త్‌ ప‌రువు మంట‌గ‌లుస్తోంద‌ని నిప్పులు చెరుగుతున్నారు. మ‌రి ఇంత‌కీ ఏం జ‌రిగింది? అనేది ఆస‌క్తిగా మారింది. పార్లమెంటు నూతన భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నం.. రాజకీయ దుమారానికి కారణమైంది.

కొత్త చిహ్నంపై విపక్షాలు, సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. హుందాగా, రాజసంగా, ఆత్మవిశ్వాసంతో ఉండే నాలుగు సింహాలు.. క్రూరంగా, దౌర్జన్యపూర్వకంగా కనిపిస్తున్నాయని, తక్షణమే మార్చాలన్నది వారి ప్రధాన డిమాండ్.

ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఈ జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. దేశంలో అతి పెద్దది ఇదే. 9,500 కిలోల బరువు, ఆరున్నర మీటర్ల ఎత్తుతో అశోక చక్రం, నాలుగు సింహాల ప్రతిమను రూపొందించారు. మోడీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంపై అభ్యంతరం తెలుపుతూ కాంగ్రెస్, టీఎంసీ సహా మరికొన్ని పార్టీల నేతలు, చరిత్రకారులు ట్వీట్ చేశారు.

మోడీ గారూ… దయచేసి సింహం ముఖాన్ని ఓసారి చూడండి. సర్నాథ్ నుంచి స్ఫూర్తిపొంది రూపొందించిన ప్రతిమలా ఉందా లేక వక్రీకరించిన గిర్ సింహం ఫొటోలా ఉందో ఒకసారి పరిశీలించండి. అవసరమైతే మార్పించండి అని ట్వీట్ చేశారు లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి.

మన జాతీయ చిహ్నాన్ని అవమానించారు. ఎడమ వైపు ఉన్నది ఒరిజినల్ ఫొటో. సింహాలు హుందాగా, రాజసంతో, ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. కుడి వైపు ఉన్నది మోదీ వెర్షన్. ఆ సింహాలు.. ఆగ్రహంతో, దూకుడుగా ఉన్నాయి. ఇది సిగ్గుచేటు. తక్షణమే మార్చండి. అని ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్.

జాతీయ చిహ్నంతో ఆటలు ఆడడం అనవసరం. మన సింహాలు అసలు ఎందుకు క్రూరంగా, కోపంగా కనిపించాలి? 1950లో అశోకుడి సింహాల నుంచి స్ఫూర్తి పొంది స్వతంత్ర భారత దేశం ఈ చిహ్నాన్ని రూపొందించింది అని ట్వీట్ చేశారు చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్. జాతీయ చిహ్నంలో మార్పును తప్పుబట్టారు సీనియర్ న్యాయవాది, సామాజిక ఉద్యమకారుడు ప్రశాంత్ భూషణ్. ‘మోడీ నవ భారత్’ ఇదేనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.