జగన్ కోసం సొంత నేత పరువు తీసేసిన బీజేపీ

అతి చేస్తే గతి చెడుతుందని ఒక సామెతుంది. ఇపుడా సామెత బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కు బాగా వర్తిస్తుంది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని వైఎస్సార్సీపీని ఎవరూ అడగలేదని సత్య కుమార్ ప్రకటించారు. అంతేకాకుండా వైసీపీ ఇప్పటికీ తమకు అంటరాని పార్టీయే అని చెప్పారు. అయితే 24 గంటల్లోపే సత్యకుమార్ ప్రకటనను బీజేపీ అధిష్టానం ఖండించింది.

కార్యదర్శి గాలితీసేస్తు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ ఒక ట్వీట్ చేశారు. ద్రౌపది అభ్యర్ధిత్వానికి మద్దతివ్వాల్సిందిగా నరేంద్రమోడీ, అమిత్ షా ఎన్డీయే భాగస్వామ్య పార్టీలను అడిగినట్లు చెప్పారు. అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కూడా కోరినట్లు షెకావత్ తన ట్వీట్లో చెప్పారు. అలాగే ద్రౌపది నామినేషన్ వేసేటపుడు ప్రతిపాదించాల్సిందిగా కూడా కోరినట్లు చెప్పారు. కార్యదర్శి చేసిన ప్రకటనతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కూడా తేల్చేశారు.

షెకావత్ ట్వీట్ తో సత్యకుమార్ గాలి తీసేసినట్లయ్యింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మోడీ, అమిత్ స్ధాయిలో తీసుకునే నిర్ణయాలన్నీ సత్యకుమార్ లాంటి నేతలకు తెలిసే అవకాశాలు లేవు. మోడీ లేదా అమిత్ షా ఫోన్ చేసి జగన్ తో మాట్లాడే విషయం సత్యకుమార్ లాంటి నేతలకు ఎలా తెలుస్తుంది ? చెబితే మోడీ, అమిత్ లేదా జగన్ చెప్పాలంతే. వీళ్ళల్లో ఎవరు చెప్పకపోతే విషయం ఎప్పటికీ బయటకు రాదు. అందుకనే సత్యకుమార్ విషయం తెలియకుండానే ఓవర్ చేశారు.

కేంద్ర ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలన్నీ తనకు తెలుస్తాయన్న బిల్డప్ ఇవ్వటానికే కార్యదర్శి ప్రయత్నం చేసినట్లు అర్ధమైసోతోంది. ఇలా తన పరిధికి మించి యాక్షన్ చేసే ఇపుడు అందరి ముందు అభాసుపాలయ్యారు. సత్యకుమార్ చెప్పింది తప్పని చెప్పటమే కాకుండా ఆయన మాటలు పార్టీకి సంబంధం లేదని కూడా షెకావత్ చెప్పటంతోనే సత్య కుమార్ స్ధాయేంటో చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఎవరు కూడా తమ పరిధి ఏమిటో తెలుసుకుని మెలిగితే ఇలాంటి సమస్యలుండవు.