కేసీఆర్‌ను బొంద పెట్టేది నేనే.. : మాజీ మంత్రి

సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను బొందపెట్టేది తానేనని సవాల్ విసిరారు. తెలంగాణకు పట్టిన శనిని వదిలించటమే తన లక్ష్యమని ప్రకటించారు. కేసీఆర్‌.. తెలంగాణ రాజ‌ప‌క్స‌గా మారిపోయార‌ని.. ఆయ‌న‌ను త్వ‌ర‌లోనే ప్ర‌జ‌లు త‌రిమికొట్ట‌డం ఖాయ‌మ‌ని చెప్పారు. డబ్బుతో తనను ఓడించాలని కేసీఆర్ కలలు కన్నారని చెప్పారు.

“నా తల్లి నాకు సంస్కారం, తెలంగాణ సమాజం సహనాన్ని ఇచ్చింది. హుజురాబాద్ ప్రజలు ధైర్యాన్ని ఇచ్చారు. కేసీఆర్ చెప్పే మాటలు, చేసే పనులకు పొంతన లేకపోవడంతో నాపై కక్ష కట్లారు. నా లాంటి వారు కేసీఆర్ నచ్చలేదు. ఆయనకు కావాల్సింది బానిసలు. అసెంబ్లీలో నా ముఖం కన్పించకుండా ఉండేందుకు రూ.600 కోట్లు ఖర్చు చేశారు. పోలీసులు లేకుండా రావాలన్న నా భార్య సవాల్‌కు.. కేసీఆర్ సచ్చిపోవాలి. 50 శాతమున్న బీసీలకు 3 మంత్రి పదవులా?.. గిరిజనులకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరు?.. నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహింవేది లేదు. తన్ని తరిమికొడతాం” అని ఈటల రాజేందర్ హెచ్చరించారు.

కేసీఆర్‌ను ఈటల టార్గెట్ చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని ఆయన సంచలన ప్రకటన చేశారు. తన ప్రస్థానం గజ్వేల్‌ నుంచే ప్రారంభమైందని, ఇక్కడి నుంచి పోటీకి సంబంధించి ఇప్పటికే తాను క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ నేత సువేందు అధికారి, అక్కడి సీఎం మమతా బెనర్జీని ఓడించినట్లుగానే, తాను ఇక్కడ సీఎం కేసీఆర్‌ను ఓడిస్తానని స్పష్టం చేశారు.

“కేసీఆర్‌ను ఢీకొట్టాలంటే మా పార్టీ నేతలు ఈగోలు పక్కనబెట్టాలి. చెట్టుకొమ్మపై ఉన్న పక్షి కన్ను మాత్రమే అర్జునుడికి కనిపించినట్లు, కేసీఆర్‌ మాత్రమే మాకు లక్ష్యం కావాలి” అని ఈటల వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని రాజేందర్ స‌వాల్ విసిరారు. గతంలో తాను చేసిన సవాలుకు కట్టుబడి ఉన్నట్టు ఈటల స్పష్టం చేశారు. ఎన్నికల్లో గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్ మీద పోటీ చేస్తానని అన్నారు. బిజెపి నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని ఆయన అన్నారు.