వైసీపీ మంత్రి అనుచ‌రుల చెరువు ఆక్ర‌మ‌ణ‌.. కోర్టులో కేసు

వైసీపీ మంత్రులు ప్రోత్స‌హిస్తున్నారో.. లేక ఏం చేసినా.. త‌మ‌ను ఆయా మంత్రులు కాప‌డ‌తార‌ని అనుకుంటున్నారో తెలియ‌దు కానీ.. మంత్రుల అనుచ‌రులు మాత్రం పేట్రేగిపోతున్నారు. ఒక్క మంత్రుల అనుచ‌రులే కాదు.. ఎమ్మెల్యేల అనుచ‌రులు కూడా రెచ్చిపోతున్నారు. అనంత‌పురం జిల్లా క‌దిరి ఎమ్మెల్యే శిద్దారెడ్డి ప్రోత్సాహంతో రాత్రికి రాత్రి ప్ర‌భుత్వ భూమిని ఆక్ర‌మించి.. గోడ‌లు క‌ట్టేసిన అనుచ‌రులు ఏకంగా త‌హ‌సీల్దార్‌నే బెదిరించిన ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన విష‌యం తెలిసిందే. ఇది ఒక‌వైపు వివాదంగా కొన‌సాగుతుండ‌గానే.. ఇప్పుడు ఇదే జిల్లాకు చెందిన మంత్రి ఉష‌శ్రీ చ‌ర‌ణ్ అనుచ‌రులు ఏకంగా చెరువును ఆక్ర‌మించిన ఘ‌ట‌న‌పై హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లైంది.

మంత్రి ఉషశ్రీ చరణ్‌పై తెలుగుదేశం పార్టీ నాయకులు కబ్జా ఆరోపణలు చేశారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం సమీపంలో 100 ఎకరాల చెరువును మంత్రి, ఆమె అనుచరులు ఆక్రమించుకుంటున్నారంటూ విమర్శలు సంధించారు. దీన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కల్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఈ పిల్ వేశారు. మంత్రి ఉషశ్రీ చరణ్, ఆమె అనుచరుల పేర్లను ఈ పిల్‌లో పొందుపరిచారు.

ఏం జ‌రిగిందంటే..

కల్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని సర్వే నంబర్ 329లో వంద ఎకరాల విస్తీర్ణంలో ఉండే సుబేదార్ చెరువును మంత్రి, ఆమె అనుచరులు ఆక్రమించుకుంటున్నారని కొన్నాళ్లుగా టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. దీనిని ఆక్ర‌మించి.. పూడ్చేసేందుకు కొన్నాళ్ల కింద‌ట ప్రొక్లెయిన్‌ను తీసుకువ‌చ్చి హంగామా చేశారు. దీంతో రంగంలోకి దిగిన టీడీపీ నేత‌లు చెరువులోకి దిగి ఆందోళ‌న చేశారు. మంత్రి వ‌చ్చి స‌మాధానం చెప్పాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. అయిన‌ప్ప‌టికీ.. మంత్రి స్పందించ‌లేదు.

అయితే.. ఇంత జ‌రిగినా.. చెరువు ఆక్ర‌మణ మాత్రం ఎక్క‌డా ఆగ‌లేదు. లారీలు, టిప్పర్లతో మట్టిని తరలించి..చెరువును పూడ్చి చేస్తున్నారని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఆ స్థలాన్ని ప్లాట్లు, వెంచర్లుగా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఇదంతా కూడా మంత్రి ఉష‌శ్రీ క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతోంద‌ని నాయ‌కులు చెబుతున్నారు.

హైకోర్టులో పిల్‌

అటు ప్ర‌భుత్వం కానీ, ఇటు మంత్రి కానీ.. ఈ విష‌యంపై స్పందించ‌క‌పోవ‌డంతో టీడీపీ నాయ‌కుడు, ఉమామ‌హేశ్వ‌ర‌నాయుడు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఆయ‌న తరఫున ప్రముఖ న్యాయవాది బాలాజీ ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పిల్‌లో పొందుపరిచిన విషయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. మంత్రి కావడం వల్ల పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. ఈ పిల్‌ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. మ‌రి దీనిపై మంత్రి ఎలాంటి వ్యాఖ్య‌లు చేస్తారో.. కోర్టుకు ఏం చెబుతారో చూడాలి.

కొస‌మెరుపు..

ఇటీవ‌లే ఓ వ్యాజ్యంలో చెరువుల‌ను ఆక్ర‌మించి నిర్మాణాలు చేప‌ట్ట‌డాన్ని హైకోర్టు సీరియ‌స్‌గా తీసుకుంది. ప్ర‌భుత్వం, ప్ర‌జాప్ర‌తినిధులే చెరువుల‌ను ప‌రిర‌క్షించ‌క‌పోతే ఎలా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ నేప‌థ్యంలో తాజా పిల్‌కు ప్రాధాన్యం సంత‌రించుకుంది.