చంద్రబాబు రూ.30 కోట్ల ఆఫర్ చేశారు : ఏపీ మంత్రి

ఒక్కోసారి అంతే.. కొందరు నేతలు గతంలోకి వెళ్లిపోతుంటారు. అలాంటి వేళలో వారి గొంతులో నుంచి వచ్చే ముచ్చట్లు మహా ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా అలాంటి విషయాన్నే చెప్పుకొచ్చారు ఏపీ మంత్రి రాజన్న దొర. తాజాగా జిల్లాల స్థాయిలో నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీలో మాట్లాడిన సందర్భంగా.. పార్టీ విషయంలో తనకున్న కమిట్ మెంట్ ను చెప్పుకొచ్చారు.

పార్టీ విషయంలో తానెంత విధేయుడిగా ఉన్నానన్న విషయం మీదనే ఆయన ఫోకస్ చేసినట్లుగా కనిపించింది. ఇందుకు తగ్గట్లే ఆయన తన గురించి చెప్పుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో తనను టీడీపీలోకి రావాలని ఒత్తిడి చేశారని.. అందుకు భారీగా తాయిలాలు ఇస్తానని కూడా ఆశ చూపించినట్లు చెప్పారు. పిల్లలకు అయ్యే చదువులతో పాటు రూ.20 కోట్లు.. మంత్రి పదవి.. అమరావతిలో ఇల్లు ఇస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు.

అయితే.. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న నమ్మకంతో.. ఆయన మీద ఉన్న అభిమానంతోనే తాను పార్టీ మారలేదని స్పష్టం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వేళలో.. జగన్ తొలి మంత్రివర్గంలో తనకు మంత్రి పదవి రానందుకు కూడా తాను బాధ పడలేదని.. పుష్పశ్రీవాణికి అవకాశం ఇచ్చినా ఒక్కమాట అనలేదన్నారు. ఈ కారణంతోనే తనకు మంత్రి పదవి దక్కిందని చెప్పుకున్నారు.

పత్రికల్లోనూ..టీవీల్లోనూ.. సోషల్ మీడియాలోనూ వస్తున్న వార్తల్లో ఏది నిజమన్న విషయాన్ని తెలుసుకోవాలని ప్రజలకు సూచన చేశారు. టీడీపీ ప్రభుత్వ పాలన గురించి ఘాటు వ్యాఖ్యలు చేసిన రాజన్న దొర.. వైసీపీ పాలనను ఆకాశానికి ఎత్తేశారు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో టీడీపీ హయాంలో రూ.వేలాది కోట్లు దోచుకున్నారని.. వైసీపీ ప్రభుత్వం మాత్రం రూ.27వేల కోట్లు మాఫీ చేసినట్లుగా పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లకు కానీ.. చంద్రబాబు అండ్ కో తనకు కట్టిన ధర గురించి రాజన్నదొర బయటకు చెప్పకపోవటం ఏమిటో?