బీజేపీ ఇంతా చేస్తే కొండా ఒక‌రేనా.. కోమ‌టి రెడ్డి ఎప్పుడు..?

భార‌తీయ జ‌న‌తా పార్టీ మిష‌న్ తెలంగాణ మొదలుపెట్టింది. జాతీయ కార్య‌వ‌ర్గాల స‌మావేశాల లోపు కీల‌క నాయ‌కుల‌కు గాలం వేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇత‌ర పార్టీల్లో పేరున్న ప‌లువురిని క‌మ‌లం గూటికి చేర్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. బండి సంజ‌య్ టీం రాత్రి ప‌గ‌లూ ఇదే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. త‌ద్వారా తెలంగాణలో తామే అస‌లైన ప్ర‌త్యామ్నాయం అని నిరూపించుకునేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది.

అందుకు అనుగుణంగా టీఆర్ఎస్‌, కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్త నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది. అయితే.. ఇంతా చేస్తే కేవ‌లం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి మాత్ర‌మే బీజేపీలో చేరేందుకు ఆస‌క్తి చూపించారు. మిగ‌తా నేత‌ల నుంచి పెద్ద‌గా స్పంద‌న ల‌భించ‌లేదు. కొంత మంది వేచి చూసే ధోర‌ణిలో ఉన్నారు. మూడో తేదీన హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌నున్న బ‌హిరంగ స‌భ‌లో.. మోదీ స‌మ‌క్షంలో కీల‌క నేత‌ల‌ను పార్టీలో చేర్పించాల‌ని.. తెలంగాణ స‌మాజానికి గ‌ట్టి మెసేజ్ ఇవ్వాల‌ని భావించిన బీజేపీకి ఎదురుదెబ్బ త‌ప్పేలా లేదు.

బీజేపీ పెద్ద‌ల చ‌ర్చ‌లు ఫ‌లించి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఒక‌రే క‌మ‌లం కండువా క‌ప్పుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. అయితే.. ఈయ‌న ఒక్క‌రి వ‌ల్ల ఒరిగేది ఏమీ ఉండ‌ద‌ని.. ఇత‌ర పార్టీల్లో ఉన్న పెద్ద త‌ల‌లు వ‌స్తేనే పార్టీకి ఉప‌యోగం ఉంటుంద‌ని యోచిస్తున్నారు. కొండా రాజ‌కీయ నాయ‌కుడు కాక‌పోవ‌డం.. ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా బ‌లం లేక‌పోవ‌డం.. కేవ‌లం ఆయ‌న వ్యాపార ప్ర‌యోజ‌నాల కోస‌మే పార్టీ మారుతున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

కానీ, ఎప్ప‌టి నుంచో బీజేపీలోకి రావాల‌ని క‌ల‌లుగంటున్న మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల రెడ్డి మాత్రం సైలెంట్ అయ్యారు. ఆయ‌న కాంగ్రెస్ పార్టీపై చాలా రోజుల నుంచి అసంతృప్తిగా ఉన్న విష‌యం తెలిసిందే. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ప‌ని అయిపోయింద‌ని.. వ‌చ్చేది బీజేపీ ప్ర‌భుత్వ‌మేన‌ని అప్ప‌ట్లోనే వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరే విష‌య‌మై అనుచ‌రుల‌తో బ‌హిరంగ స‌మావేశం కూడా నిర్వ‌హించారు. నిన్న‌టి వ‌ర‌కూ రేపో మాపో బీజేపీలో చేర‌తారు అనే విధంగా ప్ర‌వ‌ర్తించారు. కానీ హైద‌రాబాద్ లో మోదీ స‌భ స‌మీపిస్తున్న స‌మ‌యంలో మోహం చాటేస్తున్నారు.

అదీ కాకుండా రాజ‌గోపాల రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియ‌ని విధంగా అభిమానుల‌ను గంద‌ర‌గోళంలో ప‌డేస్తున్నారు. ఇన్నాళ్లూ బీజేపీ పాట పాడిన ఆయ‌న కొద్ది రోజుల క్రితం తుంగతుర్తి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వ‌డ్డేప‌ల్లి ర‌వికి కాంగ్రెస్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో అంద‌రూ అవాక్క‌య్యారు. బీజేపీలోకి వెళ్లేందుకే సిద్ధమైతే ఆయ‌న ఈప‌ని ఎందుకు చేస్తార‌ని మ‌రికొంద‌రు అనుమానిస్తున్నారు. ఇలా క‌చ్చితంగా చేర‌తార‌ని భావించిన నేత కూడా హ్యాండిస్తుండ‌డం బీజేపీ నేత‌ల‌కు మింగుడుప‌డ‌డం లేదు. మోదీ మీటింగ్ లోపు బీజేపీ ఇంకా ఎవ‌రికైనా గాలం వేస్తుందా.. లేక‌ ప్ర‌జ‌ల్లో ప‌లుకుబ‌డి లేని కేవ‌లం కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి చేరిక‌తోనే స‌రిపుచ్చుకుంటుందా అనేది వేచి చూడాలి.